తెలంగాణ పోలీసులు సినిమా రేంజ్ లో దొంగలను పట్టేసుకున్నారు.ఇటీవలే తమిళనాడులో జరిగిన దొంగతనం లో గంటలో నిందితులను పట్టుకొని శభాష్ అనిపించుకున్నారు.
ఇప్పుడు మరోసారి తమ పోలీస్ పౌరుషాన్ని చూపించారు.తాజాగా దొంగలు బస్సులో కన్నుగప్పి వెళ్తున్న సమయంలో ఫ్లైట్ లో వెళ్లి మరీ పట్టేసుకున్న సంఘటన చోటు చేసుకుంది.
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఓ బేకరీ ఉంది.ఇందులో తాజాగా దాదాపు ఐదు లక్షల రూపాయల వరకు దొంగతనం జరిగింది.దీంతో వెంటనే ఆ యజమాని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇక ఈ కేసును పోలీసులు విచారణ జరపగా.
బేకరీ లో పనిచేసే వాచ్ మన్ దొంగతనం చేసినట్లు తేలింది.అతడితో పాటు మరో ఇద్దరు కూడా ఈ దొంగతనానికి పాల్పడ్డారు.
దీంతో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా దొంగలను గుర్తించి.వాచ్ మెన్ ఫోన్ నెంబర్, వివరాలు సేకరించారు.
దొంగతనం చేసిన నిందితులు పశ్చిమ బెంగాల్ లోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన వాళ్లు.ఇక దొంగతనం చేసిన తర్వాత వీళ్లు తమ సొంత గ్రామానికి బయలుదేరారు.
జూబ్లీహిల్స్ నుంచి కోటి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో చివరిసారిగా వాళ్లు ఫోన్ మాట్లాడి స్విచ్ ఆఫ్ చేసుకున్నారు.ఇక అక్కడి నుంచి ఇమ్లీబన్ బస్ స్టేషన్ వెళ్లి అక్కడ విజయవాడ బస్సు ఎక్కి, అక్కడినుంచి ప్రతిరోజు ఉదయం బయలుదేరే కోల్ కత్తా బస్సు ఎక్కారు.
ఇక వాళ్ళు చివరిగా మాట్లాడిన ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు వాళ్ళని చేస్ చేశారు.అప్పటికే ఆలస్యం కావడంతో పోలీసులు వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని సాయంత్రం తొమ్మిది లోపు చేరే కోల్ కత్తా బస్సు ను ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులు శంషాబాద్ నుంచి మూడు గంటలకు ఫ్లైట్ లో కోల్ కత్తా కు చేరుకున్నారు.
అక్కడి నుంచి ఓ టాక్సీ లో నిందితులు వెళ్తున్న బస్సు ను ఎదురుగా అడ్డగించారు.ఇక బస్సులో పోలీసులను చూసి దొంగలు షాక్ కాగా వెంటనే వాళ్లను పట్టుకొని జూబ్లీహిల్స్ కి తరలించారు.
వారి దగ్గర ఉన్న నగదును తీసుకొని ఆ యజమానికి అందించారు.మొత్తానికి తెలంగాణ పోలీస్ సినిమా స్టైల్ లో దొంగలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.