భారతీయుల బలహీనతలకి ఆసరాగా చేసుకొని చాల విదేశీ సంస్థలు ఆన్ లైన్ మోసాలకి పాల్పడుతూ ఉంటాయి.ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆన్ లైన్ మోసాలకి తెర తీస్తూ కోట్ల సొమ్ములు లూటీ చేస్తూ ఉంటారు.
సొమ్ములు పోయినాక గుండెలు బాదుకొని ఆత్మహత్యలు చేసుకోవడం ఇక్కడ చాలా మందికి అలవాటుగా మారిపోయింది.ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆన్ లైన్ గేమింగ్ లు ఎప్పటి నుంచి ఇల్లీగల్ గేమ్స్ ని కూడా అఫీషియల్ గా రన్ చేస్తున్నాయి.
వాటిని మళ్ళీ ప్రచారం కూడా చేసుకుంటున్నాయి.మన ఇండియాలో బయట పేకాట, గ్యాంబ్లింగ్ లాంటి ఆటలు ఆడితే చట్టవిరుద్ధం.
ఎవరైనా అలా ఆడినట్లు కనిపిస్తే వారిని ఉన్నపళంగా అరెస్ట్ చేస్తారు.అయితే ఇవే ఆటలు ఆన్ లైన్ లో యధేచ్చగా సాగుతున్నాయి.
తాజాగా ఇలాంటి గేమింగ్ కార్యకలాపాలపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.దీనిలో చైనా, భారత్ కేంద్రాలుగా కార్యకలాపాలు సాగిస్తున్న పలు సంస్థలు ఆన్ లైన్ గేముల పేరిట 1100 కోట్లు కొల్లగొట్టిన వైనాన్ని గుర్తించారు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఓ చైనా దేశీయుడు సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.దీనిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మీడియాకు వివరాలు తెలిపారు.
ఆన్ లైన్ గేమ్స్ పేరుతో ప్రజల సొమ్ము దోచుకుంటున్న వారిలో భారతీయులతో పాటు చైనీయులు కూడా ఉన్నారని వెల్లడించారు.గ్రోయింగ్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సిల్లీ కన్సల్టింగ్ సర్వీసెస్, పాన్ యూన్ టెక్నాలజీస్, డైసీ లింక్ ఫైనాన్షియల్, హువాహో ఫైనాన్షియల్ సంస్థలు ఆన్ లైన్ లో గేమింగ్ పేరిట దోచుకుంటున్నట్టు గుర్తించామని వెల్లడించారు.
ఈ వెబ్ సైట్లు చైనా నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయని, ఈ సైట్లలో బెట్టింగ్ కు పాల్పడుతూ యువత పెద్ద మొత్తంలో నష్టపోతున్నారని ఆయన తెలిపారు.చాలామంది ఈ ఆన్ లైన్ గేమింగ్ లో మోసపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెల్లడించారు.
ఈ చైనా సైట్లు భారత్ కు చెందిన స్థానిక గేమింగ్ ను ఆధారంగా చేసుకుని మూడు ముక్కలాట, లోన-బయట, ఇండియన్ రమ్మీ వంటి ఆటలతో యువతకు గాలం వేస్తున్నాయని సీపీ అంజనీ కుమార్ చెప్పారు.