రెండేళ్ల తరువాత ఎవరు పరుగులు తీస్తారు? అంతర్జాతీయ స్థాయిలో పరుగుపందాలు నిర్వహించబోతున్నారా? ఇలాంటిదేమీ కాదు.హైదరాబాదులో మెట్రో రైలు రెండేళ్ల తరువాతే పరుగులు తీస్తుంది.
ఈ విషయం హైదరాబాద్ మెట్రో రైల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విబి గాడ్గిల్ తెలిపారు.రెండువేల పదిహేడో సంవత్సరం జూలైలో మెట్రో రైలు పట్టాల మీదికి ఎక్కుతుంది.
వచ్చే ఏడాదే మెట్రో రైలు ప్రారంభమవుతుందని ఇదివరకు వార్తలు వచ్చాయి.కాని మరో ఏడాది వెనక్కి పోయింది.
ఇది బృహత్తరమైన ప్రాజెక్టు కాబట్టి అనుకున్న సమయం కంటే ఆలస్యం జరగడంలో ఆశ్చర్యంలేదు.మెట్రో కోసం హైదరాబాద్ ప్రజలు కలలు కంటున్నారు.
ట్రాఫిక్ కష్టాలు కడతేరుతాయని అనుకుంటున్నారు.ఆర్టీసీ బస్సుల్లో వేలాడుకుంటూ గంటల తరబడి ప్రయాణించే బాధ తప్పుతుందని భావిస్తున్నారు.
ఒక సౌకర్యం అందుబాటులోకి వచ్చేటప్పుడు కష్టాలు భరించక తప్పదు.ప్రస్తుతం మెట్రో నిర్మాణం కారణంగా ప్రజలు అనేక బాధలు పడుతున్నారు.
కాలుష్యం పెరిగిపోయింది.ట్రాఫిక్ పద్మవ్యూహంలా ఉంది.
బస్సుల్లో వెళ్లే సామాన్యులే కాదు, కార్లలో ప్రయాణించేవారు కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.రెండేళ్ల తరువాత మెట్రోలో ప్రయాణం సుఖంగా ఉంటుందని, అందుకోసం ఈ కష్టాలు భరించాలని అనుకుంటున్నారు.