సాధారణంగా ఈ సమాజంలో ఎవరికైనా సహాయం కావాలంటే ఇతరులను అడిగి పొందుతారు.సహాయం అడిగిన వారికి కొందరు సహృదయంతో చేయూతను అందిస్తుంటారు.
మన సమాజంలో నిరుపేదలకు, ఆకలితో అలమటించే వారికి, వారి అవసరాలను తీర్చేందుకు ఎన్నో ట్రస్టులు, ఫౌండేషన్లు స్థాపించారు.అయితే వీరు ఆ ట్రస్టులను నడపడానికి విరాళాలను సేకరించి నిరుపేదలకు సహాయం చేయడం మనం చూస్తూ ఉంటాం.
కానీ ఎవరు అడగకుండా ఆకలితో అలమటించే వారికి సహాయం చేసే వారిని గొప్ప మనసున్న మనుషులుగా భావిస్తారు.అలాంటి కోవకు చెందిన వారే ఈ హైదరాబాద్ వాసి…
హైదరాబాద్ కు చెందిన మహ్మద్ ఆసిఫ్ హుస్సేన్ అనే వ్యక్తి “మశ అల్లాహ్” అనే పేరిట గత పది సంవత్సరాల నుంచి నిరుపేదలకు, ఆకలితో అలమటించే వారికి భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు.
ఈ ఆహారాన్ని ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల సమయం వరకు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.ఆయన తండ్రి స్థాపించిన సకీనా ఫౌండేషన్ ద్వారా ఈ సేవలను అందిస్తున్నారు.
ఈ ఫౌండేషన్ ద్వారా సేవలను అందించడానికి మహ్మద్ ఆసిఫ్ హుస్సేన్ ఎవరి దగ్గర విరాళాలు సేకరించకపోవడం ఆశ్చర్యకరమైన విషయం.ఈ ఫౌండేషన్ ద్వారా కులమత బేధాలు లేకుండా ఆకలితో వచ్చే ఎవరికైనా వారి కడుపు నింపుతారు.
మొదట్లో ఇంట్లోనే తయారు చేసుకొని అందరికీ అన్నదానం నిర్వహించేవారు.ఆతర్వాత ఎంతోమంది ఆకలితో అలమటించేవారు ఉండడంతో వారి అందరికి సేవ చెయ్యాలనే ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా వంటలు తయారు చేయించి ఇలా నిరుపేదల ఆకలిని తీర్చుతున్నారు.
తను ఈ ఫౌండేషన్ నిర్వహించడానికి తమ కుటుంబ సభ్యులు కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నారని హుస్సేన్ తెలిపారు.కరోనా సమయంలో ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది ఆకలి బాధలు తీర్చారు.
ఇంతటి సేవా గుణం కలిగిన హుస్సేన్ ను ఖచ్చితంగా అభినందించాల్సిందే.మరి మీరు ఏం అంటారు?
.