ఆడపిల్ల ఏ లోటు లేకుండా సుఖపడుతుందని.తమకు కూడా చెప్పుకోవడానికి గర్వకారణంగా వుంటుందనే ఉద్దేశ్యంతో అమ్మాయిల తల్లిదండ్రులు ఏరి కోరి ఎన్ఆర్ఐ సంబంధాలను వెతుకుతుంటారు.
ఎన్ఆర్ఐ అల్లుళ్ల బాగోతాలపై ఎన్ని వార్తలు వచ్చినా వీరు మాత్రం మారడం లేదు.భారతదేశంలో వున్నప్పుడు ఎంతో హుందాగా, మంచితనం నటిస్తూ అత్తింటి వారిని నమ్మించే కొందరు ఎన్ఆర్ఐలు.
తీరా పరాయి గడ్డ మీద అడుగుపెట్టిన తర్వాత తమ నిజ స్వరూపాన్ని చూపిస్తూ వుంటారు.భార్యలను అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు చిత్రహింసలకు గురిచేస్తూ వుంటారు.
కొందరైతే వీరిని విడిచిపెట్టి మరో పెళ్లి చేసుకుంటున్నారు.ఎంతో కష్టపడి పెంచి, అప్పులు చేసి ఘనంగా పెళ్లి చేసిన తల్లిదండ్రుల పరువు పొకూడదనే ఉద్దేశ్యంతో అమ్మాయిలు ఆ బాధను పంటి బిగువన భరిస్తూ వుంటారు.
అటు కన్నవారికి చెప్పుకోలేక.ఇటు భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక కొందరు మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్నారు.తాజాగా గర్భవతి అయిన భార్యను దేశం కానీ దేశంలో వదిలిపెట్టి వచ్చేసిన ఎన్ఆర్ఐ భర్త వ్యవహారం వెలుగుచూసింది.కెనడాలోని భారత హైకమీషన్ను ఆశ్రయించిన ఆమె ధీనగాథ కంటతడి పెట్టిస్తోంది.
వివరాల్లోకి వెళితే.కెనడాలోని మాన్ట్రీల్లో నివసిస్తున్న దీప్తి రెడ్డిని ఆమె భర్త చంద్రశేఖర్ రెడ్డి చెప్పాపెట్టకుండా వదిలేసి హైదరాబాద్కు వచ్చేశాడు.మెక్గ్రిల్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభాగంలో పోస్ట్డాక్ గా పని చేస్తున్న చంద్రశేఖర్.ఆగస్టు 9వ తేదీన భారతదేశానికి తిరిగి వచ్చాడు.
అప్పటి నుంచి మళ్లీ కెనడాకు వెళ్లలేదు.అయితే, అతని ఆచూకీ మాత్రం తెలియడం లేదు.
చంద్రశేఖర్ రెడ్డికి ఫోన్ చేసినా కలవకపోవడం, అతని కుటుంబసభ్యులు సైతం స్పందించకపోవడంతో ఆగస్టు 20వ తేదీన కెనడాలోని ఇండియన్ హై కమిషన్కు దీప్తి ఫిర్యాదు చేసింది.
అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో.
భర్త ఆచూకీ కోసం ట్విట్టర్ ద్వారా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది దీప్తి రెడ్డి.తన భర్త ఆచూకీ తెలపాలంటూ లేఖలో పేర్కొంది.
దీంతో స్పందించిన విదేశాంగ శాఖ అధికారులు.విషయాన్ని తెలంగాణ పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు.
వెంటనే స్పందించిన రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్.చంద్రశేఖర్ జాడను కనుక్కోవాలంటూ అధికారులను ఆదేశించారు.
అయితే చంద్రశేఖర్ రెడ్డి అన్న శ్రీనివాస్.చైతన్యపురి పీఎస్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు.శ్రీనివాసే తన భర్త చంద్రశేఖర్ను దాచాడంటూ దీప్తి విదేశాంగ శాఖకు రాసిన లేఖలో పేర్కొంది.ఈ నేపథ్యంలో దీప్తి కుటుంబ సభ్యులు శ్రీనివాస్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు.
మరోవైపు భువనగిరిలో ఉన్న దీప్తి తల్లిదండ్రులు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసిన భువనగిరి మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు.
దర్యాప్తు చేస్తున్నారు.దీప్తి ఫిర్యాదు చేస్తే చంద్రశేఖర్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.