ఆర్ధిక ఇబ్బందులు కావొచ్చు.కుటుంబాన్ని ఇంకా బాగా చూసుకునే ఆలోచన కావొచ్చు.
ఏదైతేనేం.భారతీయులు ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు.
కానీ అక్కడ అడుగుపెడితే కానీ అసలు విషయం తెలియదు.గల్ఫ్ గోసలు అంతా ఇంతా అని చెప్పలేము.
గల్ఫ్ కష్టాలు పగవాడికి కూడా రావద్దని అక్కడి నుంచి తిరిగి వచ్చిన బాధితులు చెబుతుంటారు.కార్మికులను మభ్యపెట్టి సందర్శకుల పేరిట వారిని ట్రావెల్ ఏజెంట్లు తరలించే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది.
గడువు ముగిసిన తరవాతా వీరు అక్కడే ఉండిపోతున్నారు.అక్కడి చట్టాలు కఠినంగా ఉండటంతో వీసాలు, పాస్పోర్టులు లేనివారు రహస్యంగా జీవిస్తున్నారు.
భారతీయ కార్మికుల భయం, బలహీనతలను ఆసరాగా తీసుకొని అక్కడి సంస్థలు, యజమానులు వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు.
తమ వద్ద పనిచేసేవారి వీసాలు, పాస్పోర్టులను బలవంతంగా లాక్కొని సరైన వేతనాలు ఇవ్వడం లేదు.
ఎక్కువ వేతనాలు అడిగితే వేధింపుల పర్వమే.వీసాలు, పాస్పోర్టులు లేకుండా అక్రమంగా ఉండటం వల్ల యాజమానులతో సమస్యల కారణంగా ఏటా సగటున 12వేల మందికి పైగా జైళ్లలో మగ్గుతున్నారు.
లక్షల మంది అనారోగ్యం, ప్రమాదాల బారిన పడుతున్నారు.వేలమంది భారతీయ కార్మికులు గల్ఫ్ దేశాల్లో మరణిస్తున్నారు.
విదేశాల్లో వారికి బీమా లభించడం లేదు.ఉద్యోగ భద్రత గురించి అడిగే ధైర్యం వారికీ లేదు.
పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నా భయమే! స్థానికంగా రాయబార కార్యాలయాలు ఉన్నా, ఆశించిన రీతిలో అవి బాధితులను ఆదుకోలేకపోతున్నాయి.గల్ఫ్దేశాల్లో సుమారు 30 శాతానికిపైగా భారతీయ కార్మికులే.
అక్కడి అభివృద్ధి, నిర్మాణ రంగాల్లో వారిది కీలకపాత్ర.కొద్దిరోజుల క్రితం రాజస్థాన్కు చెందిన ఇద్దరు కార్మికులు గల్ఫ్లో పడిన ఇబ్బందులను కాంగ్రెస్ పార్టీ చెందిన నేత ఒకరు వెలుగులోకి తీసుకొచ్చారు.
తాజాగా సౌదీ అరేబియా జైలులో మగ్గిపోయిన హైదరాబాద్ యువకుడు పలువురి జోక్యంతో క్షేమంగా స్వదేశానికి చేరుకున్నాడు.వివరాల్లోకి వెళితే.రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లికి చెందిన అబ్దుల్ మజీద్ నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం సౌదీ అరేబియాలోని రియాద్ నగరానికి వెళ్లాడు.అక్కడి అల్ సలారి ట్రేడింగ్ ఎస్టేట్లో సేల్స్మన్గా పనిలో చేరాడు.
అయితే సెక్యూరిటీ పరమైన లోపం కారణంగా మజీద్ కటకటాల పాలయ్యాడు.రోజూ ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఫోన్ చేసే మజీద్ గతేడాది జూలై 20 నుంచి నెల రోజుల పాటు కాంటాక్ట్లో లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు.
వెంటనే అతను పనిచేసే చోట సన్నిహితులకు ఫోన్ చేశారు.కానీ ఎవ్వరూ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో వారు మరింత కంగారుపడ్డారు.
దీంతో తమ కుమారుడి ఆచూకీ కనుగొనడంలో సాయం చేయాలంటూ మజీద్ తండ్రి అబ్దుల్ వహీద్… ఎంబీటీ నేత అంజదుల్లాఖాన్తో గోడు వెళ్లబోసుకున్నారు.
స్పందించిన అంజదుల్లా గతేడాది ఆగస్టు 21న విదేశాంగశాఖ మంత్రి డా.సుబ్రమణ్యం జై శంకర్కు, సౌదీలో ఉన్న భారత రాయబార కార్యాలయానికి లేఖలు రాశారు.అయినప్పటికీ స్పందన రాకపోవడంతో తిరిగి అక్టోబర్ 9, నవంబర్ 1న మరోసారి లేఖలు రాశారు.అంజదుల్లా ప్రయత్నం ఫలించి.10 రోజులకు రియాద్లోని భారత రాయబార కార్యాలయ సిబ్బంది స్పందించారు.మజీద్ సెక్యూరిటీ పరమైన లోపం కారణంగా సౌదీ అరేబియా పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు పంపారని తెలిపారు.దీంతో యువకుడిని విడిపించేందుకు అంజదుల్లా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
విదేశాంగ శాఖ చొరవ, సౌదీలోని భారత రాయబార కార్యాలయం అక్కడి పోలీసులతో జరిపిన సంప్రదింపుల ఫలితంగా గతేడాది డిసెంబర్లో అబ్దుల్ మజీద్ను విడుదల చేశారు.అయితే సౌదీ వదిలి వెళ్లరాదని స్థానిక పోలీసులు షరతు విధించారు.
అనంతరం ఎలాగో కష్టపడి పోలీస్ క్లియరింగ్ అందుకున్న అబ్దుల్ మజీద్ ఇటీవల నగరానికి చేరుకున్నాడు.తనను భారత్ రప్పించేందుకు సాయం చేసిన ఎంబీటీ నేత అంజదుల్లా ఖాన్ను కలిశారు.
అలాగే విదేశాంగ శాఖ, సౌదీలోని భారత రాయబార కార్యాలయ సిబ్బందికి మజీద్ ధన్యవాదాలు తెలిపాడు.