టీఎస్ ఆర్టీసీ జంట నగర ప్రజలకు శుభవార్తను అందించింది.కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా సిటీ ఆర్టీసీ సర్వీసులను నిలిపివేసిన సంగతి అందరికీ తెలిసిందే.
దాదాపు ఆరు నెలల పాటు డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు నేటి నుంచి రోడ్డెక్కనున్నాయి.ఇప్పటికే ప్రభుత్వం రాష్ట్ర సర్వీసులు ప్రారంభించగా.
జంటనగరాల్లో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బస్సు సర్వీసులను ప్రారంభించింది.సికింద్రాబాద్, హైదరాబాద్ లోని ప్రధాన రహదారుల్లో బస్సులు తిరగనున్నాయి.
ముఖ్యంగా సిటీ బస్సులు సర్వీసులు పటాన్ చెరు – చార్మినార్, పటాన్ చెరు-హయత్ నగర్, ఉప్పల్-లింగంపల్లి, గచ్చిబౌలి -దిల్ సుఖ్ నగర్, చార్మినార్, జూపార్కు, చింతల్, బీహెచ్ఈఎల్, కూకట్ పల్లి, ఎల్ బీనగర్ తదితర ప్రాంతాల్లో బస్సు సర్వీసులు ప్రారంభించనుంది.
ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు కూడా రూపొందించారు.
ఈ బస్సుల్లో ఆర్డినరీ సర్వీసుల కంటే ఎక్స్ ప్రెస్ సర్వీసులే అధికంగా ఉంటాయని, ఈ రోజు నుంచి నగరంలో మొత్తంగా 625 బస్సులు ప్రారంభం కానున్నట్లు టీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.దీంతో పాటు శంషాబాద్ ఎయిర్ పోర్టు మార్గంలోనూ బస్సులు అందుబాటులో ఉంచుతామన్నారు.
పరిస్థితులు అనుకూలిస్తే వచ్చే వారంలో మరో 50 శాతం వరకు బస్సులను అనుమతిస్తామన్నారు.ఈ వారం రోజుల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రయాణికులు సామాజికదూరం పాటించేలా జాగ్రత్త చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.
బస్సులో ఎక్కే ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.కాగా, ఏపీ-తెలంగాణ రాష్ట్ర సర్వీసుల విషయంలో ఎలాంటి స్పష్టత రాలేదు.