కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించగా అంతకు ముందే కొన్ని సర్వీసులు మరియు సేవలను ప్రభుత్వం నిలిపివేసింది.అందులో ముఖ్యంగా ఆర్టీసీ సేవలు కూడా ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజా రవాణా వ్యవస్థను కరోనా కారణంగా నిలిపేశారు.లాక్ డౌన్ కి ముందు నుండే హైదరాబాదులో సిటీ బస్సుల పరుగులు ఆగిపోయాయి.
అప్పటి నుండి ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.దాదాపుగా నూట ఎనభై ఐదు రోజులుగా సిటీ బస్సులు మొత్తం డిపోలకే పరిమితం అయి ఉన్నాయి.
కరోనా కేసులు పెరుగుతున్నా కూడా దేశంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకూడదు అనే ఉద్దేశ్యంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ లో సడలింపులు ఇస్తూ వచ్చారు.అందులో భాగంగానే నిన్నటి నుండి హైదరాబాదులో సిటీ బస్సులను కూడా తిప్పుతున్నారు.
మొదటి రోజు పాక్షికంగా సిటీ బస్సు లు తిరిగినా నేటి నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు సిటీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి.ఇన్నిరోజులుగా ఆటోలు ఇతర ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేసిన ప్రయాణికులు ఎట్టకేలకు సిటీ బస్సులు రోడ్డు ఎక్కడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల్లో కరోనా విషయమై అవగాహన వచ్చిన కారణంగా సిటీ బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటిస్తూ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.