తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేందు ఆ పార్టీ ప్రత్యర్థులంతా ఏకం అవుతున్నారు.త్వరలో జరగబోయే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ను దెబ్బేతీసేందుకు వీలుగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిలో భాగంగా ఇప్పటికే సర్కారు తీరు మీద గుర్రుగా ఉన్న సర్పంచ్ లను ప్రయోగించాలని చూస్తున్నారు.ఈ మధ్య జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగిన కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఓడించడమే లక్ష్యంగా అప్పట్లో పసుపు రైతులు రికార్డు స్థాయిలో నామినేషన్స్ వేసి సంచలనం సృష్టించారు.
వారితో నామినేషన్స్ ఉపసంహరించేలా చేసేందుకు టీఆర్ఎస్ అష్టకష్టాలు పడింది.అయినా ఆ స్థానంలో కవిత ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
ఇప్పుడు అదే ఫార్ములాను హుజురాబాద్ ఉప ఎన్నికల్లోనూ సర్పంచులచే నామినేషన్స్ వేయించి టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీలు భావిస్తున్నాయి.
తాజాగా సర్పంచుల ఛాంబర్స్ ఆధ్వర్యంలో జాయింట్ చెక్ పవర్ ని శాసన సభ సమావేశాలు ముగిసేలోపు వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేస్తూ సర్పంచుల సంఘం రౌండ్ టేబుల్ సమావేశం హైదారాబాద్ లో నిర్వహించారు.ఈ సమావేశంలో సర్పంచులకు మద్దతుగా కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ, టీజేఎస్ అధ్యక్షుడు కె.కోదండరామ్ కూడా పాల్గొన్నారు.73వ రాజ్యాంగ సవరణతో సర్పంచులకు వచ్చిన అధికారాలను తక్షణమే బదిలీ చేయాలనీ, వెంటనే పంచాయతీలకు నిధులు విడుదల చేయాలంటూ ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగానే హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రస్థావనకు వచ్చింది.
త్వరలో అక్కడ జరగబోయే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా 500 మంది సర్పంచులు నామినేషన్లు వేయాలంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపాదన తీసుకువచ్చారు.ఈ విషయంపై సానుకూల దృక్పధం కనబరిచిన సర్పంచులు దీనిపై సంఘంలో చర్చించి, త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.
ఇప్పుడు ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.ఎందుకంటే హుజూర్ నగర్ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం.ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత, అవసరం కాంగ్రెస్ పార్టీకే ఉంది.అక్కడ కనుక టీఆర్ఎస్ పార్టీ గెలిచినా, ఓడినా పెద్ద విషయం ఏమి కాదు.కానీ గెలిచేందుకు టీఆర్ఎస్ అన్నిరకాల అస్త్రాలను ప్రయోగిస్తోంది.కానీ ఇప్పుడు 500 మంది సర్పంచులతో నామినేషన్లు వేయిస్తే అది కాంగ్రెస్ కి అనుకూలంగా మారుతుందా అనేదే తేలాల్సిఉంది.
ఎందుకంటే ఇదే ఫార్ములాను తమకు అనుకూలంగా మార్చుకుని టీఆర్ఎస్ కూడా లాభపడాలని చూడవచ్చు.అదీ కాకుండా నామినేషన్ల సంఖ్య పెరిగితే చీలిపోయే ఓట్లు ఏ పార్టీలో ఖాతాలో పడతాయి అనేది కూడా తేలాల్సి ఉంది.