హుజురాబాద్ బై పోల్ కోసం ప్రధాన పార్టీలన్ని సమాయత్తమవుతుండటం మనం గమనించొచ్చు.ఇప్పటికే రాజకీయ క్షేత్రంలో బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నారు.
‘ప్రజా దీవెన యాత్ర’ పేరిట పాదయాత్ర చేస్తుండగా ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురికాగా, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఇక కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థి కోసం వెతుకుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
అధికార టీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ‘దళిత బంధు’ స్కీమ్ ప్రకటించింది.ఇతర పార్టీల్లోని కీలక నేతలను తన గూటిలోకి చేర్చుకోవడంతో పాటు ప్రజలకు పలు హామీలు ఇస్తున్నది.
అందులో భాగంగానే సామాజిక వర్గాల సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తున్నది.మొత్తంగా ప్రధాన పార్టీలన్నీ ఉప ఎన్నక కోసమై సీరియస్గానే వర్క్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతున్నది.
హుజురాబాద్ ఉప ఎన్నికతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్ ఈ నెలలోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ మేరకు ఢిల్లీ నుంచి ప్రధాన పార్టీలకు సూచనలు వచ్చినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలు రాజకీయ రణక్షేత్రంలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నాయి.హోరాహోరీగా తలపడేందుకు సమాయత్తమవుతున్నాయి.అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల నిర్వహణకు సుముఖంగా లేనట్లు సీఎస్ ప్రకటన ద్వారా తెలుస్తోంది.
ఎలక్షన్ కమిషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ నిర్వహణపై సర్కారు అభిప్రాయాన్ని కోరగా, తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో కుదరదని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే థర్డ్ వేవ్ వచ్చే సూచనలు ఉన్నట్లు చెప్పకనే చెప్తున్నాయి.
అయితే, నిజానికి ఈ ప్రకటన టీఆర్ఎస్కు ఫేవర్ చేయడం కోసం చేసిందని వాదనలు వినిపిస్తున్నారు.ప్రస్తుతం ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆశావహులు ఎక్కువ మంది ఉండగా, వారిలో ఎవరో ఒకరికి ఇస్తే మిగతా సామాజిక వర్గాల్లో నిరాశ చెలరేగే అవకాశం ఉంది.
ఈ ఎఫెక్ట్ హుజురాబాద్ బై పోల్పైన పడబోతుందని అంచనా వేశారట.ఈ నేపథ్యంలోనే సీఎస్ ప్రకటన ఉన్నట్లు చర్చ జరుగుతున్నది.
అయితే, ఆగస్టు నెలలో నిర్వహించబోయే లోక్ సభ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికల జాబితా ఇప్పటికే సిద్ధమైందని, ఆ జాబితాలో హుజురాబాద్ పేరు ఉందని తెలుస్తోంది.