గతేడాది డిసెంబర్లో భారతీయ నర్స్, ఆమె ఇద్దరు పిల్లలు దారుణహత్యకు గురైన ఘటన ఇంగ్లాండ్లో ( England ) సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి భర్తే హంతకుడని తేలింది.
ఈ మేరకు నిందితుడు బుధవారం తూర్పు ఇంగ్లాండ్ కోర్టులో నేరాన్ని అంగీకరిచాడు.అతనికి జూలైలో న్యాయస్థానం శిక్షను ఖరారు చేయనుంది.
దీంతో అప్పటి వరకు నిందితుడిని రిమాండ్లో వుంచనున్నారు.హంతకుడిని 52 ఏళ్ల సాజు చెలవాలేల్గా గుర్తించారు.
ఇతను భార్య అంజు అశోక్ (35), పిల్లలు జీవా సాజు (6), జాన్వీ సాజు (4)లను హత్య చేసినట్లు అంగీకరించాడు.
గతేడాది డిసెంబర్లో అంజు ( Anju ) ఆమె పిల్లలు తీవ్ర గాయాలతో కెట్టెరింగ్లోని వారి ఇంట్లో పడివున్నారు.దీంతో పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ ఈ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
అయితే లీసెస్టర్ రాయల్ ఇన్ఫర్మరీలో జరిగిన ఫోరెన్సిక్ పోస్ట్మార్టం పరీక్షల్లో ముగ్గురూ ఊపిరాడక మరణించారని తేలింది.ఈ కేసుకు సంబంధించి నార్త్యాంప్టన్ క్రౌన్ కోర్టు సాజుకి ( Saju ) జూలై 3న శిక్షను ఖరారు చేయనుంది.
అయితే సాజుకు జీవిత ఖైదు పడుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు.
కాగా.కేరళలోని కొట్టాయంకు చెందిన అంజు, తన భర్త పిల్లలతో కలిసి కొన్నేళ్ల క్రితం బ్రిటన్కు వెళ్లి అక్కడ నర్సుగా పనిచేస్తోంది.మరోవైపు కుమార్తె మరణవార్తను తెలుసుకున్న అంజు తల్లిదండ్రులు నాటి నుంచి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
తమ అల్లుడు సాజు గతంలో అంజూని, మనవడిని దారుణంగా కొట్టేవాడని వారు చెబుతున్నారు.సౌదీలో ఉద్యగం చేసిన సాజు.ప్రస్తుతం ఖాళీగానే వుంటున్నాడని అంజు తల్లిదండ్రులు తెలిపారు.వీరిద్దరికి 2012లో వివాహం జరిగిందని అంజు తల్లి అన్నారు.
గతంలో తాను వారితో కలిసి వున్నానని , ఆ సమయంలో అతని కోపం చూసి తానే భయపడిపోయేదాన్నని ఆమె చెప్పింది.