భార్య శవాన్ని తీసుకెళ్లడానికి డబ్బులు లేక,హాస్పటల్ వారు కనీస రవాణా సదుపాయం కల్పించక ఆఖరికి తన భార్యను తన భుజాలపై మోసుకెల్లిన మాంజిని దేశం ఇంకా మర్చిపోనేలేదు.మరో వ్యక్తి నిండు గర్భిణిగా ఉన్న తన భార్యను ప్రసవం కోసం భుజాలపై మోసుకెళ్లాడు.
పురిటినోప్పులతో బాదపడుతున్న భార్యను తీసుకుని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు కిలో మీటర్ల దూరం ప్రయాణించాడు.అయినా ఫలితం శూన్యం.
విజయనగరంలోని కొండతామరకు చెందిన 22 ఏళ్ల జిందమ్మ ఎనిమిది నెలల గర్భవతి.ప్రసవానికి ఇంకా సమయం ఉందనుకున్నారు.కాని నెలలు నిండకుండానే జిందమ్మకు పురిటినొప్పులు రావడంతో ఆమెకు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని అనుకున్నాడు ఆమె భర్త.కాని ఆ గ్రామానికి రోడ్డు సదుపాయం లేదు.ఏం చేయాలో పాలుపోని స్థితిలో తనే తన భార్యని తీసుకెల్లాలని నిర్ణయించుకున్నాడు… గ్రామస్తుల సహాయంతో వెదురు కట్టెకు ఒక చీరను కట్టి.అందులో భార్యని కూర్చొబెట్టాడు.
తనని తన భుజాలపై మోసుకెళ్లాలని అనుకున్న భర్తకి గ్రామస్థులు తోడొచ్చారు.భర్త ముందు.
వెనుకాల మరొకరు వెదురు కట్టెను తమ భుజాలపైకి ఎత్తుకొని గర్భిణిని తీసుకుని 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుగ్గేరుకు బయల్దేరారు.
అయితే జిందమ్మకు పురిటినొప్పులు అధికమవడంతో మార్గమధ్యలోనే ప్రసవించింది.
మగశిశువు జన్మించాడు.కాని బిడ్డ పుట్టాడన్న సంతోషం ఆ దంపతులకు క్షణకాలం కూడా నిలవలేదు.
పుట్టిన శిశువు అక్కడికక్కడే చనిపోయాడు.మరోవైపు జిందమ్మకు తీవ్ర రక్తస్రావం అవతుండడంతో చనిపోయిన శిశువును మరొక బట్టలో చుట్టుకుని,భార్యను తీసుకుని దుగ్గేరుకు చేరుకున్నాడు.
అక్కడినుండి అంబులెన్స్ లో పార్వతిపురానికి తరలించారు.పార్వతిపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుంది జిందమ్మ.