ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 13 కోట్లకి పైగా ప్రజలు అధికారికంగా ఆకలి బాధలు అనుభవిస్తున్నారు.వెనుకబడిన ఆఫ్రికా దేశాలతో పాటు, అభివృద్ధి చెందుతూ ఉన్న ఇండియా లాంటి దేశాలలో కూడా ఈ ఆకలి బాధలు పడుతున్న వారు అధిక సంఖ్యలోనే ఉన్నారు.
ప్రపంచంలో ఆర్ధిక వనరులు ఎంతగా అభివృద్ధి చెందిన ఆకలి బాధలని మాత్రం తగ్గించలేకపోతున్నారు.అయితే ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా విరుచుకుపడిన కరోనా మహమ్మారి కారణంగా ఈ ఆకలి బాధలు పడేవారి సంఖ్య రెట్టింపు అయ్యిందని ఐరాస పేర్కొంది.
ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని ఉన్న వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఈ విషయాన్ని అధికారికంగా ద్రువీకరించింది.ఇప్పటి వరకు ఆకలి బాధను 13 కోట్ల మంది అనుభవించగా, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం ఆ సంఖ్య 26.5 కోట్లకు చేరుతుందని పేర్కొంది.టూరిజంపై ఆధారపడిన ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలపై ఈ ప్రభావం అధికంగా ఉందని, ప్రజా రవాణా నిలిచిపోవడంతో ప్రయాణికులపై ఆధారపడి, వారికి పలు రకాల ఆహార ఉత్పత్తులను అమ్ముకుంటున్న వారూ ఆకలితో మగ్గిపోతున్నారని వెల్లడించింది.లాక్ డౌన్ నెల రోజుల వ్యవధిలోనే ఆకలితో అలమటిస్తున్న వారి జాబితాలో 13.5 కోట్ల మంది చేరిపోయారని పేర్కొన్నారు.రోజు కూలీ మీద ఆధారపడి బ్రతికేవారు ఉపాధి కోల్పోయి పేదరికంలో నెట్టబడ్డారని తెలిపారు.