ముంబైతో పాటు పలు ప్రాంతాల్లో కరోనా రోగుల కోసం ఆక్సిజన్ సిలిండర్లు అందించేందుకు స్వచ్ఛందంగా కొందరు ముందుకు వస్తున్నారు.ఎవరికైతే ఆరోగ్యం పూర్తిస్థాయిలో విషమిస్తుందో వారికి ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేయడానికి దేశవ్యాప్తంగా చాలా మంది నిస్వార్ధపరులు ముందుకు రావడం నిజంగా ప్రశంసనీయం.
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో ఇప్పటికే అన్ని ఆక్సిజన్ బెడ్స్ బుక్ అయిపోయాయి.ఒకరు చనిపోతే గానీ లేక రికవర్ అయ్యి డిశ్చార్జతే గాని ఇతర రోగులకు ఆక్సిజన్ బెడ్స్ దొరకడం లేదు.
దీంతో చాలా మంది ప్రాణాలు ఆసుపత్రి మెట్ల వద్దే గాలిలో కలిసిపోతున్నాయి.
ఈ చేదు నిజాన్ని తెలుసుకున్న రోగులు ఇంటి దగ్గరే చికిత్స పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అయితే ఇంటి వద్ద చికిత్స పొందే కొందరి రోగులలో ఆక్సిజన్ లెవెల్స్ నిజంగా తగ్గిపోతున్నాయి.దీంతో ఆ రోగులు కృత్రిమంగా ఆక్సిజన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది.
అటువంటి వారికోసం ఆక్సిజన్ సిలిండర్ లను సరఫరా చేసేందుకు ముంబైకి చెందిన బల్విందర్ సింగ్ పూనుకున్నారు.కొంతమంది యువకులతో కలిసి మలబార్ హిల్ సేవక్ జత్తా ములుండ్ సిక్కు అనే ఒక టీం ని ఏర్పాటు చేసిన బల్విందర్ సింగ్ గతేడాది కరోనా సమయంలోనూ ఆక్సిజన్ సిలిండర్లను రోగులకు అందించి ఆపన్నహస్తం గా నిలిచారు.
ఐతే ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేసేందుకు మలబార్ హిల్ సేవక్ జత్తా ములుండ్ సిక్కు యువత ఒక కాల్ సెంటర్ ని ప్రారంభించారు.వాలంటీర్ బల్విందర్ సింగ్ మాట్లాడుతూ గత సంవత్సరం మేము మూడు నెలల పాటు ఉచితంగా ఆహారం అందించాం కానీ ఈసారి ఆక్సిజన్ కొరత విపరీతంగా ఉంది కాబట్టి రెడ్ క్రెసెంట్ సొసైటీతో కలసి ఆక్సిజన్ సిలిండర్లు ప్రజలకు సరఫరా చేసేందుకు సహాయపడుతున్నాము అని చెప్పుకొచ్చారు.
మేము చేసేది ఉచిత సేవ.మేము ప్రజల నుంచి ఒక్కో సిలిండర్ కి రూ.6000 వసూలు చేస్తాము.ఆక్సిజన్ వద్దనుకున్న రోగులకు తిరిగి రూ.6000 చెల్లిస్తాము.ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చే ముందు మేము రోగుల నివేదిక, ప్రిస్క్రిప్షన్ను తనిఖీ చేస్తాము అని బల్విందర్ సింగ్ చెప్పుకొచ్చారు.