హుజురాబాద్ ఉప ఎన్నికల విషయంలో ఊహించని ట్విస్ట్ లు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి.ముఖ్యంగా అధికార పార్టీ టిఆర్ఎస్ ఈ ఉప ఎన్నికల్లో విజయం కోసం గట్టిగానే కృషి చేస్తోంది.
రాజేందర్ కు ఈ నియోజకవర్గంలో మంచి నెట్వర్క్ ఉండడంతో పాటు, బలమైన సామాజిక వర్గం అండదండలు ఉండడంతో ఆయనను ఓడించేందుకు అన్ని రకాల ఎత్తుగడలను వేస్తోంది.ఇదిలా ఉంటే ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి వ్యవహారంలో టిఆర్ఎస్ తర్జనభర్జన పడుతోంది.
వాస్తవంగా కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ లో ఎప్పుడో చేరాల్సి ఉన్నా, ఆయన ఫోన్ కాల్ సంభాషణ లీక్ కావడం, అందులో టిఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ అయింది అని మాట్లాడడం, ఆ తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలను తన వెంట తీసుకెళ్లేందుకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా మరో ఆడియో బయటకు రావడం, తదితర పరిణామాలతో ఆయన చేరికకు టీఆర్ఎస్ బ్రేకులు వేసింది.
ఇక ఆయనకు టికెట్ వచ్చే అవకాశం లేదనే ప్రచారం జరగడంతో, ఆయన షర్మిల పార్టీలో చేరబోతున్నారని హడావుడి నడిచింది.
అయితే ఇంతలోనే ఏమైందో ఏమో తెలియదు గానీ కౌశిక్ రెడ్డిని చేర్చుకునేందుకు టిఆర్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది .దీంతో ఆయన రేపు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నారు.ఆయనతో పాటు హుజూరాబాద్ నియోజకవర్గం లో కాంగ్రెస్ లో కీలక నేతలు, ద్వితీయ శ్రేణి నాయకులను చేర్పించేందుకు కౌశిక్ ఏర్పాట్లు చేసుకున్నారు.అయితే, టిఆర్ఎస్ లో చేరబోతున్న కౌశిక్ రెడ్డి కి హుజురాబాద్ టికెట్ హామీ లభించిందా లేదా మరేదైనా పదవి ఇచ్చేందుకు సిద్ధమయ్యారా అనే విషయంలో క్లారిటీ రాలేదు.
హుజురాబాద్ నుంచి టిఆర్ఎస్ తరఫున బరిలోకి దింపేందుకు చాలా మంది పేర్లు పరిశీలిస్తున్నారు. కౌశిక్ రెడ్డి తో పాటు నిన్న ఐపీఎస్ పదవికి రాజీనామా చేసిన ప్రవీణ్ కుమార్ ను టిఆర్ఎస్ లో చేర్చుకొని హుజురాబాద్ నుంచి పోటీ చేయించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.అయితే రాజేందర్ ను బలంగా ఢీ కొట్టాలంటే కౌశిక్ రెడ్డి ని ఎంపిక చేయడమే మంచిదనే సూచనలు పెద్ద ఎత్తున వస్తున్న తరుణంలో రేపు ఆయనను పార్టీలో చేర్చుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.