హుజూరాబాద్ నియోజకవర్గం లో ఉప ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరగకపోయినా, నాలుగైదు నెలల్లో ఖచ్చితంగా ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.ఈ నేపథ్యంలోనే ఇప్పటి నుంచే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాలు మొదలుపెట్టాయి.
బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పేరు ఖరారు కాగా, టిఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయం ఇప్పటి వరకూ బయటకు రాలేదు .రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నా, అధికారికంగా మాత్రం ఖరారు కాలేదు.ఇదిలా ఉంటే ఈటెల రాజేందర్ ను ఓడించడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టిఆర్ఎస్ అందుకోసం బలమైన అభ్యర్థులు కోసం వేట మొదలు పెట్టింది.ఇదిలా ఉంటే మొదటి నుంచి హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారం అవుతున్న కౌశిక్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి కి బంధువైన కౌశిక్ రెడ్డి గత ఎన్నికల్లో ఈటెల రాజేందర్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
మరోసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఆయన ఇప్పటికీ నియోజకవర్గం అంతా కార్యక్రమాలు చేపట్టారు, అయినా ఆయన కు పదవి రావడం అనుమానంగానే మారింది.
ముఖ్యంగా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన దగ్గర నుంచి కౌశిక్ రెడ్డి సైలెంట్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రేవంత్ కారణంగా తనకు టిక్కెట్ వచ్చే అవకాశం లేదని భావిస్తున్న కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.
ఇటీవలే ఓ సందర్భంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ తో కౌశిక్ రెడ్డి సంభాషించడంతో ఆయన పార్టీ మారిపోతున్నారు అనే ప్రచారం జరిగింది.
అయితే ఇందులో వాస్తవం లేదని కౌశిక్ రెడ్డి ఖండించినా, ప్రస్తుతం నెలకొన్న పరిణామాలతో ఆయన టిఆర్ఎస్ లోకి వెళ్లేందుకు, ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తున్నారు.కాంగ్రెస్ లోనే ఉన్నా, ఎలాగూ రేవంత్ తనకు టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదు అని భావించిన కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా కనిపిస్తున్నారు.