ప్రతియేడు నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ప్రజలు ఎంతో ఉత్సాహం చూపిస్తుంటారు.అయితే ఈయేడు మాత్రం కరోనా కారణంగా ఎలాంటి వేడుకలు జరుపుకోవద్దంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.
దీంతో ప్రజలు పెద్ద గుంపులుగా ఏర్పడి వేడుకలు చేసుకోలేకపోయారు.అయినా కూడా నూతన సంవత్సర వేడుకల్లో మందుబాబులు తమ ప్రతాపం చూపెట్టారు.
ప్రతియేడు కంటే కూడా ఈయేడు తాగుబోతులు ఎక్కువ మద్యాన్ని తాగిపడేసినట్లు ఆబ్కారీ లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కేవలం నూతన సంవత్సరం సందర్భంగా ఏకంగా రూ.758.76 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు.డిసెంబర్ 28 నుండి 31 వరకు పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు జరిగాయని, ఇక డిసెంబర్ 31న ఈ అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది.బయట ఎక్కడా హంగామా చేయకుండా మందుబాబులు చాలా సైలెంట్గా తమ పని తాము కానిచ్చేశారు.
ఈ రేంజ్లో వారు మందు బాటిళ్లను తాగి అవతల పడేయడంతో అధికారులు అవాక్కవుతున్నారు.కరోనా నిబంధనల కారణంగా న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేకపోయినా, ఈ రేంజ్లో మద్యం అమ్మకాలు జరగడం నిజంగా విశేషమనే అంటున్నారు పలువురు. ఏదేమైనా మద్యం ప్రియులు మాత్రం తమ ఎంజాయ్మెంట్ను ఇంచు కూడా వదులుకునేందుకు రెడీగా లేరనే దీంతో తేలిపోయింది.వేడుక, సందర్భం ఏదైనా మందు పడాల్సిందే అంటున్నారు ఈ ట్యాక్ పేయర్స్.
అసలే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదని, అందుకే మద్యం విక్రయాలను న్యూ ఇయర్ సందర్భంగా రాత్రి 12 గంటల వరకు అనుమతించడంతో మందు బాబులు తమ ప్రతాపం చూపించేశారు.ఫలితంగా ప్రభుత్వ ఖజానా దెబ్బకు నిండిపోయింది.
అయితే మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి మద్యం ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపించారు.హైదరాబాద్లో ఏకంగా 1800 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్కయినట్లు పోలీసులు తెలిపారు.