ప్రపంచ దేశాలలో ప్రబలుతున్న కరోనా విషయంలో శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఆ దేశంలో ఎవరైనా కరోనా లక్షణాలు ఉండి చెప్పకుండా దాచిపెడితే కనుక ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామంటూ అక్కడి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది.
ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాల్లో కరోనా విజృంభిస్తోంది.ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి ఐదు వేల మందికి పైగా మరణించారు.
దీంతో తమ దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు శ్రీలంక ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.వైరస్ ప్రభావిత దేశాల నుంచి శ్రీలంకకు వస్తోన్న ప్రయాణికులను అక్కడి ప్రభుత్వం క్యారంటైన్ సెంటర్లకు తరలిస్తోంది.
అయితే కొందరు ప్రయాణికులు మాత్రం క్యారెంటైన్ లకు వెళ్లకుండా తప్పుకుంటున్నారని,అలాంటి వారిని ఉద్దేశించి ఇలాంటి కఠిన చట్టాన్ని తీసుకువచ్చినట్లు అక్కడి అధికారులు తెలిపారు.ఎవరైనా విదేశాల నుంచి శ్రీలంక కు వచ్చి క్యారెంటైన్లకు వెళ్లేందుకు నిరాకరిస్తే మాత్రం అలాంటి వారిని ఎలాంటి వారెంట్ లేకుండానే అరెస్ట్ చేస్తామంటూ శ్రీలంక డీఐజీ అజిత్ రోహన్ ప్రకటించారు.
వీరి ద్వారానే కరోనా వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని ఈమేరకు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
క్యారంటైన్ నిబంధనల గురించి ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు దేశ వ్యాప్తంగా ఒక్కో పోలీస్ స్టేషన్కు ఏడుగురు అధికారులను నియమించామని చెప్పారు.
అయితే శ్రీలంక దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 18 కేసులు మాత్రమే నమోదు కాగా వారందరికీ కూడా కొలంబో నగర శివార్లలో ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది.