ఏపీ అధికార పార్టీ వైసిపి 2024 ఎన్నికల్లో గెలిచేందుకు ముందుగానే అన్ని విషయాలపై ఒక క్లారిటీకి వస్తోంది.తాము పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా, నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి సొమ్ములు జమ చేస్తున్నా.
ఎక్కడో తెలియని అసంతృప్తి ప్రజల్లో ఉందని, అలాగే ప్రభుత్వంలోని చిన్నచిన్న లోపాలను ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు, జనసేన బీజేపీ హైలెట్ చేయడం, టిడిపి అనుకూల మీడియా దానిని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళుతుండడం ఇవన్నీ తమకు ఇబ్బందికరంగా మారాయని వైసిపి గుర్తించింది.జనాల్లో ఉన్న వ్యతిరేకతను ఇప్పటి నుంచే తగ్గించకపోతే రాబోయే ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని, అప్పుడు పరిస్థితి చేయి దాటిపోతుందని ముందుగానే జగన్ తో పాటు, ఆ పార్టీలోని కీలక నాయకులు కొందరు అలర్ట్ అవుతున్నారు.
దీనిలో భాగంగానే గృహ సారధులు , సచివాలయ కన్వీనర్ల నియామకాలను చేపట్టింది.పార్టీ నిర్మాణం, బలోపేతం పై దృష్టి సారించింది.
ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలపై జనాలకు అవగాహన కల్పించడం ద్వారా, ప్రభుత్వం పై వ్యతిరేకత తగ్గించుకునే విషయంపై దృష్టి సారించింది.అలాగే కార్యకర్తలకు భరోసా ఇచ్చినట్లు అవుతుందని, వారి అసంతృప్తిని కొంతవరకైనా తగ్గించవచ్చనే ప్లాన్ తో ఉంది.
ఇదే అంశంపై జగన్ సీరియస్ గానే కసరత్తు చేస్తున్నారు.ఇదిలా ఉంటే కొంతమంది వైసిపి ఎమ్మెల్యేలు సొంతంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతూ, పార్టీ కార్యకర్తల్లోనూ, ప్రజల్లోనూ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు తన అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కుతున్నారు.పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కుటుంబానికి తాను సొంతంగా ఉచిత వైద్యం అందిస్తానంటూ ఆయన భరోసా ఇస్తున్నారు.తనతో పాటు, తన స్నేహితులు, బంధువులు మరికొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.దీని ద్వారా తన నియోజకవర్గంలో పార్టీ కోసం, తనకోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు న్యాయం చేసినట్లు అవుతుందని, వారిలో ఉన్న అసంతృప్తి తగ్గుతుందని కోటంరెడ్డి భావిస్తున్నారట.
తమ ప్రభుత్వం ఏర్పడినా.కార్యకర్తలకు ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయామనే అసంతృప్తిని కొంతవరకు అయినా తగ్గించుకోవచ్చని శ్రీధర్ రెడ్డి ఈ కార్యక్రమానికి తెర తీసారట.ఇక నెల్లూరు, కడప జిల్లాల సమన్వయకర్త మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ విధంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.తన సొంత నియోజకవర్గమైన ఒంగోలులో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
రకరకాల కారణాలతో ఇటీవల తొలగించిన పెన్షన్లతో పాటు, తమకు అర్హత ఉండి పింఛన్ అందలేదనుకున్న వారి జాబితాను తెప్పించుకుని వారితో మళ్ళీ దరఖాస్తు చేస్తున్నారుప్రభుత్వం ఆ పెన్షన్ మంజూరు చేసేందుకు సమయం పట్టినా.అప్పటివరకు ఆగితే వ్యతిరేకత పెరుగుతుందనే విషయం గుర్తించిన బాలినేని దాదాపు రెండు వేల మందికి నియోజకవర్గంలో తన సొంత సొమ్ముతో పింఛన్లు అందిస్తున్నారట.
ఇక జగన్ విషయానికొస్తే గృహసారథులు, గ్రామ వార్డు సచివాలయ కన్వీనర్ల కార్యకర్తలను నియమించడం ద్వారా, వారిలో ఉన్న అసంతృప్తిని కొంతవరకైనా పోగొట్టవచ్చని, అలాగే ప్రజలతో నేరుగా వారు కలిసి మాట్లాడటం ద్వారా, ప్రభుత్వం పై వ్యతిరేకతను కొంతవరకైనా తగ్గించవచ్చని భావిస్తున్నారట.