మనలో ఎంతో మందికి బిర్యానీ అంటే చాలా ఇష్టం.ముఖ్యంగా సెలవు దినాలు వస్తే కచ్చితంగా బిర్యాని తినాలి అనే వారు ఎందరో.
కుటుంబ సభ్యులతో లేకపోతే స్నేహితులతో కలిసి ఆప్యాయంగా పలకరించి ఇష్టపడి తినే వాటిలో మొదటి స్థానంలో ఉండేది బిర్యాని.అయితే తాజాగా బిర్యానీ కోసం కక్కుర్తిపడి ఏకంగా ఇద్దరు వ్యక్తులు ఫుడ్ ఇన్స్పెక్టర్, కారు డ్రైవర్ గా అవతారమెత్తి అడ్డంగా బుక్కయ్యారు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…
అనంతపురం జిల్లాలోని అనంతపూర్ రూరల్ మండలం అయిన నర్సినాయనికుంటకు చెందిన వెంకటేష్, రామాంజనేయులు ఇద్దరు ఈ పనికిమాలిన పనికి పాల్పడ్డారు.ఇందులో వెంకటేష్ బాబు ఎస్టీ కార్పొరేషన్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిలా పనిచేస్తుండగా.
అతడి స్నేహితుడు రామాంజనేయులు నాయక్ తో కలిసి ఈ బిర్యాని దందాకు దారి తీశారు.బిర్యాని లపై ఎక్కువ ఇష్టం పెంచుకున్న వెంకటేష్ బాబు ఫుడ్ ఇన్స్పెక్టర్ గా అలాగే అతని కారు డ్రైవర్ గా రామాంజనేయులు అవతారమెత్తి హోటల్స్ పై రైడ్ చేసి అక్కడ వారితో బిర్యాని ప్యాకెట్లు పార్సల్ తీసుకు వెళ్ళడం మొదలు పెట్టారు.
ఇందులో భాగంగానే తాజాగా మూడు రోజుల క్రితం అనంతపూర్ నగరంలోని క్లాక్టవర్ సమీపంలో ఉన్న హైదరాబాద్ బిర్యానీ హోటల్ కు వెళ్లి అక్కడ 7 బిర్యాని ప్యాకెట్లు పార్సెల్ చేయించుకున్నారు.తాజాగా మరోసారి వచ్చి 4 బిర్యాని ప్యాకెట్లు పార్సల్ చేయించుకున్నారు.అయితే ప్రతిసారి తన వద్దకు రావడం ఏంటి అని అనుమానం వచ్చిన ఆ హోటల్ నిర్వాహకుడు అబ్దుల్ భాష బిర్యానీ పార్సెల్ తీసుకోవడానికి వచ్చిన కార్ డ్రైవర్ ను ప్రశ్నించాడు.అయితే కారు డ్రైవర్ గా వచ్చిన రామాంజనేయులు హోటల్ యజమాని తో నువ్వు ఫుడ్ ఇన్స్పెక్టర్లను ఎదిరించి మాట్లాడతావా.? అంటూ గొడవ పెట్టుకున్నాడు.దీంతో అనుమానం వచ్చిన హోటల్ ఓనర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందించాడు.
దీంతో పోలీసులు విచారణ చేపట్టగా వారు నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్, కారు డ్రైవర్ అని తేలడంతో వారిద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు పోలీసులు.