వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటుతోంది.ఈ సందర్భంగా ప్రభుత్వ పాలన ఎలా ఉంది ? జగన్ తాను చెప్పిన హామీలను నెరవేర్చడా లేదా ప్రభుత్వ పథకాలు ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా ? ఇలా అనేక విషయాలు తెర మీదకు వస్తున్నాయి.నాకు ఆరు నెలల సమయం ఇవ్వండి మంచి సీఎం గా నేను నిరూపించుకుంటాను అంటూ ప్రమాణ స్వీకారం సందర్భంగా జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఇప్పుడు ఆరు నెలల సమయం ముగిసిపోయింది.
జగన్ ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలయ్యాయో ఒకసారి పరిశీలిస్తే … జగన్ ప్రధాన హామీల్లో ఒకటి నవరత్నాలు.ఈ పథకం అమలు కోసం జగన్ చిత్తశుద్ధితో పని చేస్తున్నట్టు కనిపిస్తోంది.
దీని అమలు కోసం మంత్రిమండలి తో ఒక కమిటీని కూడా నియమించారు జగన్.ఇక మిగతా పథకాల విషయానికి వస్తే ఈ ఆరు నెలల కాలంలో చేసినవి తక్కువే.
నవరత్నాలలో ఒకటైన రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకు ఒకేసారి 12,500 అంటూ జగన్ ప్రకటించారు.కానీ అధికారంలోకి వచ్చాక కేంద్ర కిసాన్ సమ్మాన్ కింద ఇస్తున్న ఆరు వేలు వైసీపీ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంది.అవి కాకుండా 6500 మాత్రమే ఇస్తామని అని ప్రకటించారు.కానీ అమల్లోకి వచ్చేసరికి మరో వెయ్యి పెంచి వాటిని మూడు విడతలుగా అందిస్తామని ప్రకటించారు.దీంతో రైతులు నిరాశ చెందారు.కౌలు రైతుల కోసం కొత్తగా ఓ పథకాన్ని ప్రవేశపెట్టినా ఇందులో ఎక్కువ మందిని అనర్హులుగా చేశారు.
ఇక అమ్మఒడి, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు వైయస్సార్ చేయూత పథకం కింద ఇస్తున్న 75000 ఫీజు రీయింబర్సమెంట్, డ్వాక్రా రుణమాఫీ, అందరికీ ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఇంకా అమలుకు నోచుకోలేదు.ప్రతి కుటుంబానికి ఏడాదికి లక్ష నుంచి 5 లక్షల వరకు లబ్ధి కలిగిస్తామని జగన్ ప్రకటించారు.
ఈ ఆరు నెలల కాలంలో ఇలా లబ్ధి పొందినవారు అతి తక్కువ మంది.
అగ్రిగోల్డ్ బాధితులకు మొదటి ఆరు నెలల్లో 1150 కోట్లు ఇచ్చి అందర్నీ ఆదుకుంటామని జగన్ భరోసా ఇచ్చారు.కానీ ఆరో నెలలో 260 కోట్లు మాత్రమే ఇచ్చారు.మిగిలిన సొమ్ము తరువాత ఇస్తామని ప్రకటించారు.
అధికారంలోకి వచ్చిన మొదటి వారంలోనే సిపిఎస్ ఎస్ విధానాన్ని రద్దు చేస్తామంటూ ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు.కానీ ఆరు నెలలు అయినా కమిటీల మీద కమిటీలు వేస్తూ వస్తున్నారు.
ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.కానీ ఇప్పుడు వరకు ఆ దిశగా అడుగులు పడడం లేదు.
ఇక రేషన్ కార్డు మీద సెప్టెంబర్ నాటి నుంచి అందరికీ సన్న బియ్యం ఇస్తామన్నారు.ఆ తర్వాత అసలు సన్నబియ్యం ఇస్తామని అనలేదని, నాణ్యమైన బియ్యం ఇస్తామని చెప్పమని మాట మార్చారు.
గత ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకున్న ప్రజా పథకాల విషయంలోనూ జగన్ మొండిగా వ్యవహరిస్తూ వచ్చారు.
అందులో ముఖ్యంగా పేదలకు ఐదు రూపాయలకే కడుపునిండా అన్నం పెట్టే అన్న క్యాంటీన్ లను మూసివేయడం, ఇప్పటికీ వాటిని కనీసం పేరు మార్చి అమలు చేయకపోవడంపై పేద ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
ఇలా చెప్పుకుంటూ వెళితే ఆరు నెలల కాలం ప్రభుత్వం సాధించిన విజయాల కంటే ప్రతికూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.అయితే కాస్త ఆలస్యం అయినా వీటన్నిటిని అమలు చేయాలనే దృఢ సంకల్ప మంత్రం జగన్ లో కనిపిస్తోంది.