తెలంగాణాలో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల్లో హుజూర్ నగర్ ఉప ఎన్నిక టెన్షన్ బాగా ఎక్కువగా కనిపిస్తోంది.ఇక్కడ ఎలా అయినా గెలవాలనే ధృడ సంకల్పం అన్ని పార్టీల్లో బలంగా కనిపిస్తోంది.
దీంతో అందరి ద్రుష్టి ఇప్పుడు జరుగుతున్న పోలింగ్ మీదే ఉంది.హుజూర్నగర్ శాసన సభ స్థానానికి ఉప ఎన్నిక సోమవారం ఉదయం పోలింగ్ మొదలయ్యింది.
ఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం 302 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగబోతోంది.24న ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.మొత్తం 2,36,943 మంది ఓటర్లు పోలింగ్లో పాల్గొనబోతున్నట్టు అంచనా వేస్తున్నారు.
దీనిలో మహిళా ఓటర్లు 1,16,508 మందికాగా, పురుషులు, 1,20,435 మంది.
అసలు ఇక్కడ ఉప ఎన్నిక రావడానికి ప్రధాన కారణం పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కారణం.ఇక్కడ ఎమ్యెల్యేగా గెలిచిన ఆయన ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేసి గెలుపొందడంతో హుజూర్ నగర్ లో తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.
ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనే విషయంలో అనేక తర్జన భర్జనలు జరిగినా చివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డిని బరిలో నిలిచారు.ఇక టీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి, బీజేపీ నుంచి డాక్టర్ కోటా రామారావు, టీడీపీ నుంచి చావ కిరణ్మయితో కలిపి మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
అయితే గుర్తుల విషయంలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు ఎక్కడ లేని టెన్షన్ ఇక్కడ మొదలయ్యింది.
ఈవీఎంకు అనుసంధానం చేసే బ్యాలెట్ యూనిట్తో గరిష్టంగా 15 మంది (నోటాతో కలిపి 16) అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉన్న కారణంగా ఇక్కడ రెండు బ్యాలెట్ యూనిట్లనుఉపయోగిస్తున్నారు.మొత్తం 1,497 మంది పోలింగ్ సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో పాలుపంచుకుంటున్నారు.ఈ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.
గెలవడం ముఖ్యంగా ఈ రెండు పార్టీలకు అత్యవసరం.ఇక ఈ నియోజకవర్గం పరిస్థితి చూసుకుంటే ఇక్కడ మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి.
నాలుగైదు మండలాల్లో ఓ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉన్నట్టు ప్రి పోలింగ్ అంచనాలు చెపుతున్నాయి.ఈ సారైనా ఎలాగైనా హుజూర్నగ్లో గెలవాలని అధికార టీఆర్ఎస్ పార్టీ చూస్తుండగా, సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ గెలుచుకుని తమ పట్టు పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది.
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ మీద ప్రజాగ్రహం పెరిగిందని ఇది తమకు లాభిస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తుండగా సమ్మెకు దీనికి సంబంధమే లేదని ఇక్కడ తామే గెలుస్తామని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది.