రాంబాబూ…బాబ్బాబ్బాబు ఎలా ఉంది చూడు .అదే మహేశ్.
ఎంత బాగుంది ఆ పేరులో వైబ్రేషన్స్ ఉన్నాయి… బాగుంటే మాత్రం,వైబ్రేషన్స్ ఉంటే మాత్రం ఇప్పుడు రాంబాబు పేరు మహేశ్ బాబుగా మారదు కదా.అలా మారాలన్న ఎన్నో తంటాలు పడాలి.అలా పడేకంటే ఈ రాంబాబు పేరుతోనే కష్టాలు పడొచ్చు అనుకుంటున్నారా… వద్దు మీరు మహేశ్ గా మారొచ్చు.మహేశ్ కాదు.మీకు నచ్చిన ఏపేరైనా పెట్టుకోవచ్చు.పుట్టగానే తల్లిదండ్రులు పెట్టేపేరు అందరికి నచ్చకపోవచ్చు.
కాబట్టి పేరు మార్చుకోవడం ఎలాగో తెలుసుకోండి…పేరు మార్చుకోండి.
రాష్ట్రంలో నివసించే వ్యక్తి ఆడ, మగ ఎవరైనా సరే ముందుగా తహసీల్దార్కు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవోపీ నెం.619, తేదీ: 08-12-1977 ప్రకారం నిర్ణీత ఫారంతో దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తుతో పేరు మార్చుకోవాలన్న కోరికను తెలుపుతూ తనను భారతదేశ పౌరునిగా గుర్తిస్తూ ఒక ఉత్తర్వు జారీ చేయాలని కోరాలి.
ఈ దరఖాస్తు వెంట సంబంధిత పోలీస్ స్టేషన్ సబ్ఇన్స్పెక్టర్ నుంచి తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేనట్లు ధ్రువీకరణ పత్రం పొంది సమర్పించాలి.
దరఖాస్తు అందు కున్న తర్వాత సంబంధిత తహసీల్దార్ రెవెన్యూ ఆర్ఐ పరిశీలన చేయించి భారత పౌరునిగా గుర్తింపు పొందడానికి అర్హుడై ఉన్నాడని ఒక మెమోరాండం జారీ చేస్తారు.
తర్వాత దరఖాస్తుదారు ఆ మెమోరాండం ప్రతిని గెజిట్లో ప్రచురించమని దరఖాస్తు చేసుకోవాలి.గెజిట్లో ప్రచురితమైన తర్వాత ప్రజలందరికీ తెలిసేలా రాష్ట్రవ్యాప్తంగా వెలువడుతున్న ఏదేని ప్రముఖ దిన పత్రికలో పేరు మార్చుకుంటున్నట్లు ప్రకటించుకుంటే పేరు మారినట్లు లెక్క.
విద్యార్థులైతే ఉన్న సర్టిఫికెట్లను గెజిట్, దినపత్రిక ప్రకటనకు జత చేసి సంబంధిత విద్యా విభాగాల్లో పేరు మార్పించుకుని కొత్త పేరుతో సర్టిఫికెట్లు పొందే వీలుంది.
ప్రభుత్వ ఉద్యోగులు కూడా…
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారులు కూడా పేరు మార్చుకోవడాన్ని సరళతరం చేసింది.1985 ఏప్రిల్ 24న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల వినతిపై ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవోపి నెం.182 జారీ చేసి ప్రభుత్వ సర్వీస్లో ఉన్నవారికి ఈ పేరు మార్చుకునే పద్ధతి రూపొందించింది.
ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులు తహసీల్దార్కు దరఖాస్తు చేసుకోనవసరం లేదు.రూ.5 నాన్ జ్యూడీషియల్ స్టాంపు పేపర్ మీద ఒక దస్తావేజుపై పేరు మార్చుకుంటున్నట్లు రాయాలి.
ఆ దస్తావేజును రిజిష్టర్ చేయాల్సిన అవసరం లేదు.
కానీ అటువంటి దస్తావేజును రాసుకున్నట్లు రాష్ట్ర గెజిట్లో ప్రచురణకు దరఖాస్తు ఇవ్వాలి.గెజిట్లో ప్రచురితమైన తర్వాత ఏదేని ప్రముఖ దినపత్రికలో పేరు మార్చుకున్నట్లు ప్రకటించుకోవాలి.
ఈ పద్దతులు పాటించిన తర్వాత సంబంధిత దస్తావేజును గెజిట్, దినపత్రిక ప్రచురణ ప్రతులతో సంబంధిత శాఖాధికారికి ఆర్జీ పెకట్టుకుంటే సర్వీసు బుక్తో పాటు అన్ని ప్రభుత్వ రికార్డులన్నింటిలో పాత పేరు పోయి కొత్త పేరు చోటు చేసుకుంటుంది.