ఇందిరమ్మ అంటే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కాదు.ఉమ్మడి రాష్ర్టంలో కాంగ్రెసు ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు.
పేదలకు ఉద్దేశించిన ఈ ఇళ్ల నిర్మాణంలో అనేక అక్రమాలు జరిగాయని, నిధులు భారీగా దుర్వినియోగమయ్యాయని టీఆర్ఎస్ సర్కారు భావించింది.దీంతో దీనిపై సిఐడి విచారణకు ఆదేశించింది.
ఇందిరమ్మపై విచారణ జరిపిన సిఐడీ అధికారులు ఇరవైఐదు శాతం ఇళ్ల నిర్మాణాలు బోగస్ అని తేల్చారు.ఈ నివేదిక ఇంకా ప్రభుత్వానికి అందకముందే ఈ సంగతి లీక్ అయింది.
పేదల కోసం అమలు చేసే సంక్షేమ పథకాల్లో ఎప్పుడూ అక్రమాలు జరుగుతూనే ఉంటాయి.ఇందిరమ్మలో దొంగ ఇళ్లు చాలానే ఉన్నాయని జనం అనుకుంటూనే ఉన్నారు.
అదే సిఐడీ కూడా చెప్పింది.పాత ఇళ్లకే సున్నాలు, రంగులు వేసుకొని బిల్లులు తీసుకున్నారని సిఐడీ నివేదిక తేల్చింది.
కాంగ్రెసు ప్రభుత్వం రెండువేల ఆరో సంవత్సరంలో ఈ పథకం ప్రవేశపెట్టినప్పుడు కొంతకాలం బాగానే అమలు జరిగినా తరువాత దారి తప్పింది.కేసీఆర్ అధికారంలోకి రాగానే విచారణకు ఆదేశించారు.
మూడేళ్లుగా ఈ ఇళ్లకు బడ్జెటు లేకపోవడంతో ఏడు లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది.ఇవి పూర్తి కావాలంటూ మూడువేల కోట్లకు పైగా డబ్బు కావాలట….! మరి కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.