ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు సత్తా చాటిన సంగతి తెలిసిందే.అమెరికా ప్రతినిధుల సభలో మెజారిటీని సొంతం చేసుకుని సభపై ఆధిపత్యం సంపాదించారు.
ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్పై దృష్టి పెట్టారు.ఆయన కుటుంబం ముఖ్యంగా కుమారుడు హంటర్ విదేశీ వ్యాపారాలపై దర్యాప్తును ఎదుర్కోవాల్సి వుంటుందని రిపబ్లికన్లు తేల్చిచెప్పారు.
బరాక్ ఒబామా హయాంలో దేశ ఉపాధ్యక్షుడిగా వున్న తన తండ్రి జో బైడెన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యాపార సంబంధాలను ప్రభావితం చేశారని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు.ఈ వ్యవహారం అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020 సమయంలోనూ హాట్ టాపిక్గా మారాయి.
ఓ ల్యాప్టాప్ నుంచి అనేక కథనాలు, వ్యక్తిగత ఫోటోలు బయటికి వచ్చినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.బైడెన్ అధ్యక్షుడు అయిన తర్వాత ఈ వ్యవహారం సద్దుమణిగింది.
మళ్లీ ఇప్పుడు హౌస్లో రిపబ్లికన్ల ఆధిపత్యం కారణంగా హంటర్ బైడెన్కు చెందిన పాత విషయాల్ని తవ్వే అవకాశం కనిపిస్తోంది.
గురువారం ప్రతినిధుల సభ పర్యవేక్షణ కమిటీ ఛైర్మన్ జేమ్స్ కోమర్ మీడియాతో మాట్లాడుతూ.
కుటుంబ వ్యాపారాలకు సంబంధించి జో బైడెన్ దేశ ప్రజలకు అవాస్తవాలు చెప్పారని ఆరోపించారు.దేశ అత్యున్నత పదవిని బైడెన్ దుర్వినియోగం చేశారని… హంటర్ పన్ను ఎగవేత, మోసాలకు పాల్పడ్డారని కోమర్ ఆరోపించారు.
ఈ నేపథ్యంలో బైడెన్ కుటుంబంపై దర్యాప్తు జరుపుతామని ఆయన స్పష్టం చేశారు.
అంతేకాదు… హంటర్ బైడెన్ చైనీయులతో అనుసరించిన వ్యాపార లావాదేవీలకు సంబంధించి 87 పేజీల ఒక నివేదిక కూడా అప్పట్లో బయటకు వచ్చింది.చైనా ప్రభుత్వంతో బలమైన సంబంధాలు వున్న కొందరితో హంటర్ బైడెన్కు ఆర్ధిక లావాదేవీలు వున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.వీరిలో ప్రధానంగా సీఈఎఫ్సీ చైనా ఎనర్జీ కో లిమిటెడ్ వ్యవస్థాపకుడు యే జియాన్మింగ్, అతనితో పాటు యే సహచరుడు, గోంగ్వెన్ డాంగ్ వున్నట్లు కూడా నివేదిక తెలిపింది.
చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వంతో యే బలమైన సంబంధాలను కలిగి వున్నాడు.వీటన్నింటికి మించి హంటర్.ఉక్రెయిన్ గ్యాస్ కంపెనీ బురిస్మా కోసం తండ్రి అధికారాన్ని వాడుకున్నారంటూ ట్రంప్ హయాంలో పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.దీనిపై అప్పట్లోనే రిపబ్లికన్లు విచారణను డిమాండ్ చేశారు.