ఎవరీ త్యాగధనులు? సైనికులా? కార్మికులా? శ్రామికులా? వీరు త్యాగధనులు కాదని అనలేం.కాని ఇక్కడ మనం చెప్పుకునే త్యాగధనులు రైతులు.
అందులోనూ ఆంధ్రప్రదేశ్ రైతులు.రాజధాని అమరావతి నగర నిర్మాణానికి తమ విలువైన భూములు ఇచ్చి వీరు త్యాగధనులయ్యారు.‘మీరు త్యాగధనులు.మీ త్యాగం ప్రశంసనీయం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.
రాజధాని నిర్మాణం కారణంగా ఈ ప్రాంతంలో భూముల ధరలు విపరీతంగా పెరుగుతాయని, కాబట్టి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.ఈ వాస్తవాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు.
కొత్త రాజధాని నగరం నిర్మించాల్సిరావడం తనకు గౌరవప్రదంగా ఉందన్నారు.దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తామని చెప్పారు.
కేంద్రం కూడా సాయం చేస్తుందన్నారు.భూములిచ్చిన రైతులకు పూర్తిగా న్యాయం చేస్తామన్నారు.
ఏపీ రైతులు త్యాగం చేశారనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.ఏడాదికి మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం ఇచ్చారు.
భూములు తీసుకున్న చంద్రబాబు సర్కారు వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి అధికారంలోకి వస్తే రైతులకు పూర్తి న్యాయం చేస్తారని అనుకోవచ్చు.ఒకవేళ వేరే ప్రభుత్వం ఏర్పడినా అది భూములిచ్చిన రైతులను విస్మరించకూడదు.
బాబు హయాం ముగిసేనాటికి రాజధాని నిర్మాణం పూర్తి కాదు.ఇంకా కొన్నేళ్లు పడుతుంది.
ఏ సర్కారు ఏర్పడినా రాజధానిని బ్రహ్మాండంగా నిర్మించడం ప్రధానం.