ఇటీవల హాంకాంగ్ లో చైనాకు నేరస్తుల అప్పగింతకు సంబంధించి బిల్లు ను ప్రవేశ పెట్టడం పై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే.అయితే ఈ నిరసనలు రోజు రోజుకు ఉదృతం కావడం తో మొత్తానికి హాంకాంగ్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
తాత్కాలికంగా ఈ బిల్లును ప్రభుత్వం నిలిపివేస్తున్నట్లు సీఈ ఓ కేరి లామ్ తాజాగా మీడియా సమావేశంలో ప్రకటించారు.పార్లమెంట్ లో ఈ బిల్లును ప్రవేశపెట్టడం తో గత కొద్దిరోజులుగా హాంకాంగ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
దీనితో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి వారిని అదుపుచేసే ప్రయత్నం చేసినప్పటికీ పరిస్థితులు మరింత దారుణంగా మారిపోయాయి.దీనితో చేసేదేమి లేక అక్కడ ప్రభుత్వం దిగొచ్చి ఈ బిల్లును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
బిల్లుపై కొన్ని వర్గాల్లో విబేధాలు వచ్చాయని, కొందరు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున ప్రస్తుతానికి ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం లేదని కేరీ లామ్ స్పష్టం చేశారు.
అంతేకాకుండా వ్యతిరేకత వ్యక్తం అవుతున్న ఈ బిల్లును మరింత స్టడీ చేసేందుకు కొంత సమయం అవసరమని ప్రభుత్వం భావిస్తుందని అందుకే తాత్కాలికంగా ఈ బిల్లును నిలిపివేస్తున్నట్లు లామ్ ప్రకటించారు.అయితే మరోపక్క చైనా అనుకూల రాజకీయ నాయకులు మాత్రం లామ్ ప్రకటన తరువాత కనీసం బిల్లుపై ఒకసారి చర్చ జరపాలి అంటూ లామ్ కు సూచించినట్లు తెలుస్తుంది.అయితే దేశ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని వారి అభీష్టం మేరకే నడుచుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు లామ్ స్పష్టం చేశారు.