కరోనా కారణంగా అన్ని రంగాలపైనా ఆంక్షలు విధించిన భారత ప్రభుత్వం నెమ్మదిగా వాటిని సడలించుకుంటూ వస్తోంది.తాజాగా విదేశీ జర్నలిస్టులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది.
చెల్లుబాటయ్యే వీసాలతో విదేశీ జర్నలిస్టులు వారి కుటుంబసభ్యులతో సహా భారత్కు వచ్చేందుకు అనుమతించింది.జర్నలిస్ట్ (జె -1) వీసా కలిగి ఉన్న విదేశీ పౌరులు, జె -1 ఎక్స్ వీసా కలిగి ఉన్న జర్నలిస్టుల కుటుంబ సభ్యులు దేశంలోకి ప్రవేశించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతించింది.
జె-1, లేదా జె-1 ఎక్స్ వీసాలు కలిగి ఉండి ఒకవేళ అవి సస్పెండ్ అయి ఉంటే వాటిని వెంటనే పునరుద్ధరించుకోవాలని కేంద్రం సూచించింది.ఆ వీసాల చెల్లుబాటు గడువు ముగిసి వుంటే తాజా వీసాలు పొందాలని నోటిఫికేషన్లో పేర్కొంది.
ఇండియాకు రావాలనుకునే మరిన్ని వర్గాల విదేశీ పౌరులకు వీసా, ప్రయాణ ఆంక్షలను మరింత సడలించాల్సిన అవసరాన్ని పరిగణనలోనికి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ తన ఉత్తర్వుల్లో తెలిపింది.ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుల ద్వారా భారతదేశంలోకి వచ్చే ప్రయాణీకుల రాకపోకలపై ప్రస్తుతం ఉన్న ఆంక్షలు విదేశీ జర్నలిస్టులకు వర్తించవని వెల్లడించింది.
కాగా యూఎస్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలతో కుదుర్చుకున్న ‘‘ ఎయిర్ బబుల్ ’’ ఒప్పందంపై భారత్ సంతకం చేసింది.దీని ప్రకారం ఈ దేశాల్లో ఉన్న ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డుదారులు భారతదేశాన్ని సందర్శించడానికి వీలు కల్పించింది.ఈ దేశాల నుంచి వచ్చిన ఇతర విదేశీయులు కూడా వ్యాపారం, వైద్య, ఉపాధి ప్రయోజనాల కోసం భారతీయ వీసా పొందటానికి కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే.