అగ్ర రాజ్యం అనగానే చటుక్కున గుర్తొచ్చేది అమెరికానే.పెద్దన్నగా చలామణీ అయ్యే అమెరికాకు కరోనా తీవ్ర నష్టాన్ని మిగల్చగా కోలుకోవడానికి ఎక్కువ సమయమే పడుతుందని అంచనా వేస్తున్నారు ఆర్ధిక నిపుణులు.
ఇదిలాఉంటే ఒక పక్క కరోనా దెబ్బకు అమెరికాలోని రాష్ట్రాలకు రాష్ట్రాలు అల్లాడి పొతే తాజాగా ప్రకృతి ప్రకోపానికి అమెరికాలోని కీలక రాష్ట్రమైన కాలిఫోర్నియా కరువు కోరల్లో కి నెట్టబడుతోంది.ఎన్నడూ జరుగని విధంగా పెద్ద విపత్తు కాలిఫోర్నియా రాష్ట్రాన్ని ముంచెత్తింది.
కాలిఫోర్నియాలోనే రెండవ అతిపెద్ద జలాశయమైన ఆరోవిల్ లో నీళ్ళే కరువైపోయాయి.
అంతటి పెద్ద జలాశయంలో నీళ్ళు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.
నాలుగు కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో ఇంతపెద్ద జలాశయం లో నీళ్ళు లేకపోతే భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు ప్రజలు.ఇక్కడ కొన్నేళ్ళుగా వర్షాలు పడకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని, ఈ జలాశయం నుంచీ దాదాపు 27 మిలియన్ ప్రజలకు నీటి సరఫరా జరుగుతుందని, ప్రతీ ఏడాది దాదాపు 8 లక్షల మందికి విద్యుత్ సరఫరా చేయడంలో ప్రధాన ఆధారం ఈ జలాశయమేనని తెలుస్తోంది.
ఇదిలాఉంటే కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ గావిన్ కరువు తీవ్రతపై అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు.అంతేకాదు ఈ జలాశయంలో దాదాపు 200 లకు పైగా హౌస్ బోట్లు ఉంటాయని వీటన్నిటిని వెంటనే జలాశయం నుంచీ బయటకు తీసుకురావాలని కూడా గవర్నర్ ఆదేశించారట.
నీటిమట్టం ఒకే సారి తగ్గిపోవడంతో బోట్లు పాడయ్యే అవకాశం ఉంటుందని అందుకే బయటకు తీసుకువచ్చే ఏర్పాటు చేయాలని ఆదేశించారని అంటున్నారు అధికారులు.ఏది ఏమైనా వర్షాలు పడితేనే కానీ కాలిఫోర్నియా ఈ విపత్తు నుంచీ తప్పించుకునే అవకాశం లేదంటున్నారు నిపుణులు.