నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు.దీనిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున చెబుతున్నారు.
సోషల్ మీడియాలో టిడిపి పెద్ద ఎత్తున బాబు విజయాల పైన, ఆయన గొప్పతనం పైన పోస్టింగ్ పెడుతూ, ఆయన పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు అనేక సూచనలు , సలహాలు ఇస్తున్నారు .ఇప్పటి వరకు పార్టీని నడిపించిన తీరును ప్రశంసిస్తూ, గత కొంతకాలంగా పార్టీ పతనావస్థకు చేరడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా కారణమయ్యాయి అనే దానిపైన విమర్శలు చేస్తున్న వారు అధికంగానే ఉన్నారు.చంద్రబాబు రాజకీయ చాణిక్యుడు అనేది వాస్తవం.
పార్టీ ఏ పరిస్థితుల్లో ఉన్న, జనాల్లో ఏదో ఒకరకంగా సెంటిమెంట్ పుట్టించి, పార్టీని అధికారంలోకి తీసుకు రావడం, పార్టీపై సానుభూతి పెరిగేలా చేయడంలో బాబు బాగా సిద్ధహస్తులు.అందుకే ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో సక్సెస్ లు చూశాడు.
దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక వ్యక్తిగా గుర్తింపు పొందారు.బాబు అషామాషి వ్యక్తి ఏమీ కాదు.
ఆయన తెలివి తేటలను అంచనా వేయడం రాజకీయ ఉద్దండులకు సైతం సాధ్యం కాదు.చాలా కాలంగా బాబు గ్రాఫ్ ఇదే విధంగా ఉంటూ వచ్చింది.
అయితే ప్రస్తుతం టిడిపి ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూస్తుంటే ఆ గ్రాఫ్ పడిపోయింది.
బాబు వైఖరిలో మార్పు రావాలని, గతంలో మాదిరిగా ఇప్పుడు చంద్రబాబు నిర్ణయాలు, ఆలోచనలు ఉండటం లేదని, పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని, దీనంతటికీ కారణం బాబు చుట్టూ ఉన్న కోటరీనే కారణం అని, వారు చెప్పినట్లు గానే బాబు తన నిర్ణయం తీసుకుంటున్నారు తప్ప సొంతంగా తన నిర్ణయాలను తీసుకోలేక పోతున్నారు అనేది కూడా తెలుగు తమ్ముళ్ల ఆవేదన.2014 లో టిడిపి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవమే.విభజన సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీకి రాజధాని నిర్మించుకోవాలన్నా, మళ్లీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏర్పడాలన్న, ఆయన అధికారంలోకి రావాలనేది జనం నుంచి వచ్చిన అభిప్రాయం కావడంతో , సులువుగానే అధికారంలోకి వచ్చారు.
అప్పుడు బిజెపి, జనసేన మద్దతు కూడా ఉంది.కానీ ఆ తర్వాత ఒక టీవీ ఛానల్ అధిపతి సలహాతో బీజేపీతో వైరం పెట్టుకుని ఆ పార్టీకి దూరం అయ్యారు.
కానీ అలా చేయడం ఎంత తప్పో 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి ఎదురైతే కానీ అర్థం కాలేదు. ఇక ఇప్పుడు చూస్తే , పంచాయతీ ఎన్నికల్లో టిడిపి ప్రభంజనం ఎక్కడ కనిపించలేదు.మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక్క మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంది.అది కూడా అక్కడి అభ్యర్థి బలం ఆధారంగా తప్ప , పార్టీ కారణంగా కాదు.
కానీ మళ్లీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించి మరోసారి సరిదిద్దుకో లేని తప్పు బాబు చేశారు.ఎన్నికలంటే తెలుగుదేశం పార్టీ భయపడుతుందని , అధికార పార్టీని ఎదుర్కొనే సత్తా లేదని, తెలంగాణలో ఆ పార్టీ ఎలా ఉనికి కోల్పోయిందో, అదే విధంగా ఏపీలోనూ చంద్రబాబు తర్వాత టిడిపి నామరూపాలు లేకుండా పోతుందని, లోకేష్ పార్టీని చక్కదిద్దే అంతటి శక్తి సామర్థ్యాలు లేవు అనే అభిప్రాయం జనాల్లోకి బలంగా వెళ్ళిపోయింది.
ప్రస్తుతం బాబు సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా, కోటరీపైనే అధారపడుతూ, వారి నిర్ణయాలే అమలు చేస్తూ, బాబు పార్టీని మరింతగా దెబ్బ తీస్తున్నారు అనే అభిప్రాయం సొంత పార్టీ నేతల్లోనూ వ్యక్తమవుతోంది.ఇప్పటికైనా ఆయన ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిదని, బాబు ఇప్పటికైనా మారాలని , మారకపోతే టిడిపి భవిష్యత్తు అంధకారం లోకి వెళ్తుందని తెలుగు తమ్ముళ్ల ఆవేదన చెందుతున్నారు.