ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు.అది ఇది అని కాకుండా అన్ని రంగాలపై పెను ప్రభావం చూపిస్తూ ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలను కుప్పకూలుస్తోంది ఈ మహమ్మారి.
దీని కారణంగా ఇప్పటికే అమెరికా సహా అనేక దేశాల్లో లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయారు.కేవలం సామాన్యులే కాకుండా సంపన్నులు కూడా కంటికి కనిపించని సూక్ష్మజీవితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
స్టాక్ మార్కెట్లు వరుసగా కుప్పకూలుతుండటంతో కుబేరుల సంపద ఆవిరవుతోంది.
తాజాగా కోవిడ్ 19 ప్రభావం బ్రిటన్లోని భారత సంతతికి చెందిన హిందూజా, రూబెన్ సోదరులపై పడింది.
హిందూజా సోదరులు శ్రీచంద్, గోపిచంద్ గతేడాదితో పోలీస్తే 600 కోట్ల పౌండ్లు (భారత కరెన్సీలో 55,000 కోట్లు) కోల్పోయి రెండో స్థానంలో నిలిచినట్లు ‘‘ ది సండే టైమ్స్ రిచ్లిస్ట్ 2020’’ పేర్కొంది.ఈ అన్నదమ్ముల సంపద చెరో 1,600 కోట్ల పౌండ్లు ( భారత కరెన్సీలో రూ.1.47 లక్షల కోట్లు).కరోనా కారణంగా హిందుజా సోదరులకు చెందిన అశోక్ లేలాండ్ షేర్ సగానికి పడిపోయింది.ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు ధర భారీగా పతనం కావడంతో.వీరిద్దరూ వాటా పెంచుకునే ప్రయత్నం చేశారు.చమురు ధరలు సైతం క్షీణించడంతో గల్ఫ్ ఆయిల్ సంస్థపైనా ప్రభావం పడింది.
ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యం ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో మెరైన్ విభాగం కూడా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది.
ఇక భారత సంతతికి చెందిన డేవిడ్, సైమన్ రూబెన్ సోదరులు కూడా 266 కోట్ల పౌండ్లు (భారత కరెన్సీలో రూ.24,500 కోట్లు) సంపద పొగొట్టుకుని… హిందుజా సోదరులతో కలిసి రెండో స్థానంలో నిలిచారు.కాగా ఈ లిస్ట్లో బ్రిటన్ వ్యాపారవేత్త జేమ్స్ డైసన్ అగ్రస్థానంలో నిలిచారు.
చైనా, ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలు పెంచుకోవడంతో డైసన్ అగ్రస్థానం దక్కించుకున్నట్లు ది సండే టైమ్స్ వెల్లడించింది.ఇదే జాబితాలో అనిల్ అగర్వాల్ 207 కోట్ల పౌండ్లు కోల్పోయి 850 కోట్ల పౌండ్లతో 15వ స్థానంలో, లక్ష్మీమిట్టల్ 388 కోట్ల పౌండ్లు కోల్పోయి 678 కోట్ల పౌండ్ల సంపదతో 19వ స్థానానికి పడిపోయారు.
కాగా యూకేలో ఇప్పటి వరకు 2,43,695 మంది వైరస్ బారినపడగా, 34,636 మంది ప్రాణాలు కోల్పోయారు.