ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయ హిందువులు మన ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను అక్కడ కూడా పాటిస్తున్నారు.ఏ దేశానికి వెళ్లినా మూలాలు మరిచిపోకుండా ముందుకు సాగుతున్నారు.
అంతేకాదు.ఆయా ప్రాంతాల్లో హిందూ ఆలయాలను నిర్మిస్తున్నారు.
ఇప్పుడు అనేక దేశాలలో మన ఆలయాలు వెలుగొందుతుండటం వెనుక వీరి కృషి ఎంతో వుంది.కరడుగట్టిన ముస్లిం దేశాల్లోనూ ఇప్పుడు హిందూ మతానికి మంచి ఆదరణ లభిస్తోంది.
ఆయా దేశాల్లో భవ్యమైన ఆలయాలు కొలువుదీరుతున్నాయి.తాజాగా దుబాయ్లోని జెబెల్ అలీ ప్రాంతంలో నిర్మితమైన ఆలయాన్ని దసరా పర్వదినం నాడు ప్రారంభించనున్నారు.
2020లో ఈ ఆలయానికి శంకుస్థాపన చేయగా.కోవిడ్ కారణంగా పనులు ఆలస్యమై ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకుంది.
హిందూ – అరబిక్ శిల్పకళతో ఈ ఆలయాన్ని నిర్మించారు.ఈ దేవస్థానంలో 16 మంది దేవీదేవతలు కొలువయ్యారు.
ఇప్పటికే సెప్టెంబర్ 1 నుంచి ఆలయం పాక్షికంగా తెరుచుకుంది.జెబెల్ అలీ ప్రాంతంలోని ‘వర్షిప్ విలేజ్’లో ఈ హిందూ దేవాలయం వుంది.
ఎన్నో చర్చిలు, గురుద్వారాలు, దేవాలయాలు ఇతర ఆధ్యాత్మక కేంద్రాలకు ఆ ప్రాంతం నిలయంగా వుంది.అన్నట్లు ఆలయాన్ని దర్శించుకునేందుకు గాను క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకొచ్చారు నిర్వాహకులు.
అయితే రోజుకు వెయ్యి నుంచి 1200 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు.ఇందుకోసం వెబ్సైట్లో బుక్ చేసుకోవాల్సి వుంటుంది.
ఈ ఆలయంలో వినాయకుడు, కృష్ణుడు, మహాలక్ష్మీ, అయ్యప్పలతో పాటు మొత్తం 16 మంది దేవీదేవతలకు నిత్యపూజలు నిర్వహించేందుకు గాను 8 మంది పూజారులను కూడా నిర్వాహకులు రిక్రూట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.ప్రతిరోజూ ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఆలయం తెరిచే వుంటుంది.ఈ ఆలయ మధ్య గోపురంలో అతిపెద్ద త్రీడి ప్రింటెడ్ గులాబీ రంగు కమలాన్ని అమర్చారు.అలాగే డిజిటల్ లైబ్రరీ, వేద భాషలపై భౌతిక, ఆన్లైన్ తరగతులను ఏర్పాటు చేశారు.ప్రతిరోజూ రాత్రి 7.30 గంటలకు హారతి, ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయని ఆలయ వెబ్సైట్ తెలిపింది.భక్తులు.వివరాలు, దర్శనాల బుకింగ్స్ కోసం hindutempledubai.comను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.