కరోనా వైరస్తో ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ఎక్కువగా నష్టపోయిన దేశం అగ్రరాజ్యం అమెరికాయే.ఇప్పటి వరకు 1.29 మిలియన్ల మంది కోవిడ్ 19 బారినపడగా.76,537 మంది ప్రాణాలు కోల్పోయారు.దీనిని ఏ విధంగా కట్టడి చేయాలో తెలియక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మల్లగుల్లాలు పడుతున్నారు.ఈ క్రమంలో అమెరికన్ల ఆరోగ్యం, భద్రత, శ్రేయస్సు కోసం జాతీయ ప్రార్ధన సేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైట్ హౌస్ రోజ్ గార్డెన్లో ఒక హిందూ పూజారితో ప్రార్ధనలు నిర్వహించారు.
న్యూజెర్సీలోని బీఏపీఎస్ స్వామి నారాయణ మందిరానికి చెందిన పూజారి హరీశ్ బ్రహ్మభట్ను వైట్ హౌస్కు రావాల్సిందిగా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఆహ్వానించారు.కోవిడ్ 19 నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు సామాజిక దూరం, లాక్డౌన్ వంటివి ఉపయోగపడతాయని హరీశ్ తన ఉపన్యాసంలో తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనాలని.యజుర్వేదం నుంచి తీసుకున్న కొన్ని శ్లోకాలను ఆయన తొలుత సంస్కృతంలో, ఆ తర్వాత ఆంగ్లంలోనూ బోధించారు.
తన కోరిక మేరకు వైట్హౌస్కు వచ్చి ప్రార్ధనలు నిర్వహించినందుకు గాను హరీశ్కు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు.ప్రస్తుతం అమెరికా ఒక మహమ్మారిపై యుద్ధంలో నిమగ్నమై ఉందని, సంక్షోభ సమయంలో ధైర్యం కోసం మనం దేవుడిని ప్రార్ధిస్తామని ట్రంప్ తన సందేశంలో అన్నారు.ఆయన సతీమణి మెలానియా ట్రంప్ మాట్లాడుతూ.కోవిడ్ 19 కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆమె తన సానుభూతిని తెలిపారు.వైరస్ సోకి ఆసుపత్రుల్లో ఉన్నవారి కోసం, దీనిపై పోరాడుతున్న వారికి మరింత ధైర్యాన్ని నింపేలా ప్రార్ధనలు చేద్దామని మెలానియా పిలుపునిచ్చారు..
ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మాట్లాడుతూ… అమెరికన్లు చాలా కాలం నుంచి ప్రార్ధనల శక్తిని నమ్ముతున్నారని గుర్తుచేశారు.1863లో అబ్రహం లింకన్ అమెరికన్లను ప్రార్ధించమని కోరినట్లు మైక్ పెన్స్ గుర్తుచేశారు.కాగా న్యూజెర్సీ రాబిన్ విల్లెలోని బీఏపీఎస్ స్వామినారాయణ్ ఆలయానికి చెందిన ఒక పూజారి హాజరై వైట్ హౌస్ వద్ద ప్రార్ధనలు పఠించడం ఇదే మొదటిసారి.రాబిన్స్విల్లెలోని బీఏపీఎస్ ఆలయం భారత్ వెలుపల ఉన్న అతిపెద్ద స్వామి నారాయణ్ దేవాలయంలో ఒకటి.