చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇలా రంగం ఏదైనా సరే.ప్రపంచంలోని ఎన్నో దేశాల యువత డెస్టినేషన్ అమెరికా.
నాణ్యతతో కూడిన విద్య, మంచి ఉపాధి మార్గాలు, మెరుగైన జీవన విధానాలతో అగ్రరాజ్యం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.అందుకే కోట్లాది మంది యువత అమెరికా వెళ్లాలని కలలు కంటారు.
భారతీయులకు సైతం ఫేవరెట్ డెస్టినేషన్ అమెరికాయే.అయితే కోవిడ్ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను అగ్రరాజ్యానికి పంపడానికి భయపడ్డారు.
అయితే ఇప్పుడు పరిస్ధితులు చక్కబడుతుండటంతో అమెరికా ప్రయాణాలు మళ్లీ ఊపందుకున్నాయి.
అటు భారత్లో కరోనా కేసులు, మరణాలు అదుపులోకి వస్తుండటంతో అమెరికా ప్రభుత్వం మనదేశంపై ప్రయాణ ఆంక్షలను సడలించింది.
ఈమేరకు భారత్కు చేసే ప్రయాణాలకు సంబంధించి అడ్వైజరీ ‘స్థాయి(లెవెల్)’ని 4 నుంచి 3కి తగ్గించింది.ఇంతవరకు ఉన్న లెవెల్ 4 అడ్వైజరీ ప్రకారం భారత్కు ప్రయాణాలపై పూర్తి నిషేధం ఉండేది.
దీన్ని సడలించడంతో ఇక ప్రయాణాలు చేయదలిచిన పౌరులకు ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని సూచిస్తారు.బైడెన్ యంత్రాంగం నిర్ణయంతో అమెరికా నుంచి భారత్కు వెళ్లే వారికి లైన్క్లియర్ అయింది.
భారత్లో కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుతుండటంతో సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) లెవల్-3 హెల్త్ నోటీసు జారీ చేసింది.
అయితే ప్రస్తుతం భారత్ నుంచి అమెరికాకు వెళ్లే విమాన టికెట్ల ధరలు పెరిగినట్లుగా తెలుస్తోంది.
కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో అమెరికాకు విమాన సర్వీసులు నడుస్తుండడం, ఇదే సమయంలో భారత్ నుంచి యూఎస్ వెళ్లే విద్యార్థుల సంఖ్య భారీగా ఉండడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.వచ్చే నెల నుంచి యూఎస్లోని యూనివర్శిటీల్లో తరగతులు ప్రారంభం కానుండటంతో పాటు ఇరు దేశాల్లోనూ కేసులు తగ్గుముఖం పట్టడంతో భారత్లోని యూఎస్ కాన్సూలేట్ కార్యాలయాలు ఓపెన్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో తొలి ప్రాధాన్యంగా విద్యార్థులకు మాత్రమే వీసాలు జారీ చేస్తున్నారు.దీంతో విద్యార్ధులు అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా విమాన సర్వీసులు లేకపోవడంతో టికెట్ల రేట్లను ఆపరేటర్లు అమాంతం పెంచేశారు.సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి యూఎస్ వెళ్లేందుకు ఎకానమీ తరగతి టికెట్ ధర రూ.60 వేలుగా ఉంటే.ప్రస్తుతం దీని ధర రూ.90 వేల నుంచి రూ.2.20లక్షల వరకూ ఉంది.అయితే, అమెరికన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా, ఖతార్ ఎయిర్లైన్స్ విమానాల్లో మాత్రం ఈ టికెట్ ధర రూ.90 వేలుగానే వుండటం విశేషం.
కాగా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం నుంచి విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలను పెంచడం కూడా టికెట్ల ధరల పెరుగుదలకు కారణంగా నిపుణులు చెబుతున్నారు.కంపెనీలు విమాన ఇంధనాన్ని 2.44 శాతం మేర పెంచాయి.దీంతో ఢిల్లీలో ఇప్పటి వరకు కిలో లీటర్ (1,000 లీటర్లు) రూ.68,262.35గా ఉన్న ధర రూ.69,857.97కు, ముంబైలో రూ.66,482.90 నుంచి రూ.68,064.65కు చేరింది.ఈ ఏడాది జనవరి నుంచి దేశంలో ఏటీఎఫ్ ధర 40 శాతం పెరిగింది.
విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చుల్లో 35 నుంచి 50 శాతం ఇంధన ఖర్చులకే పోతుంది.దీంతో విమాన ప్రయాణం మరింత భారంగా మారేసూచనలు కనిపిస్తున్నాయి.