ఏపీలో పరిషత్ ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి.ఈనెల 8వ తేదీన పోలింగ్ నిర్వహించబోతున్న క్రమంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ, అభ్యర్థులు ఉత్కంఠగా ఎన్నికల తేదీ కోసం ఎదురు చూస్తూ ఉండగా, అకస్మాత్తుగా హైకోర్టు ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది.
ఎన్నికల నిర్వహణపై ఏపీ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది.ఈ నెల 15న ఎస్ ఈసీ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది.
ఎన్నికలకు నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమలు చేయాలని సుప్రీంకోర్టు నిబంధనలు పాటించలేదని , ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది.ఈ మేరకు ఈ నెల ఒకటో తేదీ ఎస్ ఈసీ నీలం సాహ్ని ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ తధంతర చర్యలను నిలిపి వేయాలని ధర్మాసనం ఆదేశించింది.
కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఏపీ ఎన్నికల అధికారి నీలం సాహ్ని నిర్ణయంపై బిజెపి, జనసేన, టిడిపి కోర్టులో పిటిషన్ వేయగా దానిపై ఈ తీర్పు వెలువరించింది.దీనిపై డివిజన్ బెంచ్ కు వెళ్లే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది.ఈనెల 1వ తేదీన ఎస్ సి సి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం చూసుకుంటే, ఈనెల 8వ తేదీన పోలింగ్, పదో తేదీన పరిషత్ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు.అయితే ఈ పరిణామాలపై పోటీలో ఉన్న అభ్యర్థులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
అసలు గత ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉండగా, అప్పట్లో కరోనా వైరస్ ప్రభావం తో ఆ నిర్ణయం వాయిదా పడింది.ఇక ఇప్పుడు ఈ విధంగా మరోసారి వాయిదా పడడంతో అభ్యర్థులంతా ఉసూరుమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక టిడిపి విషయానికి వస్తే ఇప్పటికే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టిడిపి అధినేత చంద్రబాబు పొలిట్ బ్యూరో లో చర్చించి, ఆ నిర్ణయాన్ని ప్రకటించారు.అయితే నిర్ణయాన్ని టీడీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చాలాచోట్ల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ బాబు నిర్ణయాన్ని పక్కన పెట్టినట్లు గా వ్యవహరిస్తున్నారు.ఇప్పుడు ఈ విధంగా జరగడంతో మళ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ ఎప్పుడో అని ఉత్కంఠ అన్ని పార్టీలు, ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది.
ఎన్నికలు ఇలా వాయిదా పడుతూ ఉంటే ఆర్థికంగా తాము నష్టపోతామనే బాధ పోటీల్లో ఉన్న అభ్యర్థుల్లో నెలకొంది.