సమ్మె చేయడం కార్మికుల, కార్మిక సంఘాల హక్కు.సమ్మె చేయడమంటే ప్రభుత్వ విధానాల పట్ల నిరసన వ్యక్తం చేయడమే.
సమ్మె చేయడం కార్మికుల హక్కేగాని దానివల్ల ప్రజలకు అనేక ఇబ్బందులు కలుగుతాయి.కాని సమ్మె చేయకుండా డిమాండ్లు సాధించుకోవడం సాధ్యం కాదు.
అంటే కార్మికులు సంఘటితమై పోరాటం చేస్తేనే ప్రభుత్వాలు దిగివస్తాయి.కాని సమ్మెను ప్రభుత్వాలు అంగీకరించవు.
కాని సమ్మె చేయకుండా ఆపలేవు.ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆర్టిసి కార్మికులు జీతాల పెంపు కోసం సమ్మె చేస్తున్నారు.
ఐదు రోజులుగా బస్సులు స్తంభించాయి.ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఎక్కువ డబ్బు చెల్లించి ప్రయివేటు వాహనాల్లో ప్రయాణిస్తున్నారు.వాటిల్లో భద్రత గురించిన గ్యారంటీ లేదు.
అయితే ఏ రంగంలోని కార్మికులు సమ్మె చేసినా సరే హైకోర్టు వెంటనే ‘ఈ సమ్మె చట్ట విరుద్ధం’ అని చెబుతుంది.సమ్మె చేయడం చట్ట ప్రకారం మాకున్న హక్కు అని కార్మికులు వాదిస్తారు.
కాని కోర్టు అంగీకరించదు.ఈ విషయంలో ఎప్పుడూ న్యాయస్థానానికి, కార్మికులకు వివాదమే.
ప్రస్తుతం ఆర్టిసి కార్మికుల సమ్మెపై కూడా హైకోర్టు ‘చట్ట విరుద్ధం’ అనే వ్యాఖ్య చేసింది.ప్రభుత్వ ఉద్యోగులకు నలభైరెండు శాతం ఫిట్మెంట్ ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వరు అని ఆర్టిసి కార్మికులు అడుగుతున్నారు.
అయితే వీరు ప్రభుత్వ ఉద్యోగులు కారు.కాని సంస్థకు సంబంధించిన నిర్ణయాలన్నీ ప్రభుత్వమే తీసుకుంటుంది.
ఇదో వైరుధ్యం.సమ్మె చట్టవిరుద్ధమని కోర్టు చెప్పినా కార్మికులు ఆపరనేది అందరికీ తెలిసిందే.