కారు పార్టీకి కారుచౌక భూములు.ఇతర పార్టీలకు మొండిచెయ్యి.
ప్రజలకు హ్యాండిచ్చినట్లుగానే రాజకీయ పార్టీలకు కూడా గులాబీదళపతి హ్యాండిస్తున్నారు.అన్ని పార్టీలకు జిల్లా కేంద్రాల్లో భూములిస్తానంటూ చట్టం తెచ్చారు.
తన పార్టీకి మాత్రమే ఖరీదైన భూములు ఇచ్చేసుకుంటున్నారు.ఇతర పార్టీల ఫైళ్ళు మాత్రం పక్కన పడేస్తున్నారు.కారుచౌక భూములపై కేసీఆర్ కు హైకోర్టు నోటీసులిచ్చింది.కేసీఆర్ సమాధానం ఏం చెబుతారో చూడాలి.
జనం సొమ్ముతో కోట్లకు పడగలెత్తుతున్నాయి రాజకీయ పార్టీలు.తెలంగాణలో 20 ఏళ్ల క్రితం పుట్టిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ కు ఇప్పటికే రెండు వేల కోట్లకు పైగా స్థిర చరాస్థులు ఉన్నాయి.
తమ పార్టీ దగ్గర 865 కోట్ల రూపాయల నగదు నిల్వలున్నాయని పార్టీ ప్లీనరీ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చెప్పారు.మరో వెయ్యి కోట్లకు పైగా విలువైన పార్టీ కార్యాలయ భవనాలు, స్థలాలున్నాయని కూడా వివరించారాయన.
ఇంత విలువైన సంపద ఉంచుకుని కూడా బంజారాహిల్స్ లో లక్షల విలువ చేసే గజం స్థలం వంద రూపాయాలకు కొట్టేయాలనే కక్కుర్తి ఎందుకు? రాష్ట్రంలోని అన్ని పార్టీలకు జిల్లా కేంద్రాల్లో ఎకరానికి తగ్గకుండా, గజం వంద రూపాయల చొప్పున పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి భూములివ్వాలని 2018 ఆగస్టు 16న తెలంగాణ సర్కార్ జీవో జారీ చేసింది.ఆ మేరకు అన్ని జిల్లాల్లో గులాబీ పార్టీకి మెయిన్ రోడ్ల మీద ఖరీదైన భూములు కేటాయించుకుని గజం వంద రూపాయలకు కొట్టేసింది.
అనేక చోట్ల పార్టీ భవనాలు కూడా వేగంగా నిర్మాణమవుతున్నాయి.జనగామ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రారంభించారు.
రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ కేవలం టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే స్థలాలు ఇచ్చారు.ఇతర పార్టీలు దరఖాస్తులు పెట్టుకున్నా వాటిని తుంగలో తొక్కారు.ఇదే వరుసలో హైదరాబాద్ జిల్లా పార్టీ కోసం బంజారా హిల్స్ లో వంద కోట్ల విలువైన 4,935 గజాల స్థలాన్ని గజం వంద రూపాయలకు కేటాయించింది ప్రభుత్వం.దీనిపై ఒక వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో వ్యవహారం బట్టబయలైంది.
జిల్లాల్లో ఎక్కడా ఇతర పార్టీలకు కేటాయించకుండా కేవలం గులాబీ పార్టీకే భూములు కేటాయించుకుంటున్నా ఎవరూ కోర్టుకు వెళ్ళలేదు.హైదరాబాద్ వంద కోట్ల స్థలానికి గులాబీ పార్టీ టెండర్ పెట్టడంతో కేసు కోర్టు దాకా వెళ్ళింది.
పిటిషన్ ను విచారించిన హైకోర్టు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూ వ్యవహారాల కమిషనర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది.దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో చూడాలి.
ఉమ్మడి రాష్ట్రంలోనే 1987లో అప్పటి ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో పార్టీలకు భూములు ఇవ్వడానికి ఒక జీవో ఇచ్చింది.అయితే కొన్ని కండిషన్స్ పెట్టింది నాటి ప్రభుత్వం.జిల్లా కేంద్రంలో పార్టీకి భవనం గాని స్థలం కాని లేకపోతేనే ప్రభుత్వ 30 ఏళ్ళ లీజుకు స్థలం కేటాయిస్తుంది.ఆ తర్వాత పార్టీ రిక్వెస్ట్ పెడితే లీజు పొడిగిస్తుంది.
అయితే కేసీఆర్ ప్రభుత్వం ఆంక్షలన్నీ తొలగించేసి ఏకమొత్తంగా గజం వంద రూపాయలకు స్థలం అన్ని పార్టీలకు జిల్లా కేంద్రాల్లో ఇవ్వడానికి జీవో జారీ చేసింది.అయితే ఎక్కడా ఇతర పార్టీలకు గజం కూడా కేటాయించలేదు.
కాని అధికార పార్టీకి మాత్రం వీలును బట్టి ఎకరం నుంచి రెండు ఎకరాల వరకు భూమిని కేటాయించింది.ఇప్పుడు హైదరాబాద్ స్థలం రచ్చకెక్కి న్యాయస్థానానికి చేరింది.