నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు పై జనవరి 31 న పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ అమలు పై స్టే విధించిన విషయం తెలిసిందే.అయితే దీనిపై అటు కేంద్రం,ఇటు ఢిల్లీ సర్కార్ రెండూ కూడా హైకోర్టు పిటీషన్ లు దాఖలు చేయగా వాటిపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ లో పెట్టింది.
ఈ నేపథ్యంలో ఈ రోజు ఆ పిటీషన్ లపై తీర్పు వెల్లడించిన హైకోర్టు పాటియాలా కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ను సమర్ధించింది.పాటియాలా హౌస్ కోర్టు తీర్పును పక్కన పెట్టేందుకు కోర్టు నిరాకరించింది.
అయితే శిక్ష అమలు జాప్యానికి చేసే ప్రయత్నాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు వారం లోగా దోషులు తమ న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాలని ఆదేశించింది.ఆ తర్వాత నిబంధనలకు అనుగుణంగా వెళ్లాలని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఈ కేసుకు సంబంధించి దోషులకు విడివిడిగా ఉరిశిక్ష అమలు చేయడం మాత్రం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది.2012 డిసెంబర్ లో నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులు అయిన పవన్, అక్షయ్, వినయ్, ముకేశ్ లను దోషులుగా చేర్చుతూ వారికి ఉరిశిక్షలు అమలు చేయాలి అంటూ గతంలో పాటియాలా హౌస్ కోర్టు తీర్పు వెల్లడించింది.అయితే దోషుల్లో ముగ్గురు అయిన పవన్,వినయ్,అక్షయ్ లు జనవరి 30 న పిటీషన్లు దాఖలు చేశారు.
వీటిపై అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రాణా జనవరి 31న విచారణ చేపట్టారు.
రాష్ట్రపతికి క్షమాభిక్ష కోసం వినయ్ దాఖలు చేసిన అభ్యర్థన పెండింగ్లో ఉన్నదని దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ కోర్టుకు తెలిపడం, ఒకే కేసుకు సంబంధించి ఒకరి పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పుడు మిగతా వారికి ఉరిశిక్ష అమలు చేయకూడదన్న నిబంధనను కూడా కోర్టుకు గుర్తుచేయడం తో వారి ఉరిశిక్ష అమలు ను నిరవధికంగా వాయిదా వేయాలని కోర్టును కోరడం తో కోర్టు కూడా అంగీకరించి స్టే విధించింది.దీనితో ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు వారి ఉరిశిక్షలు అమలు కావాల్సి ఉండగా ఒక్కరోజు ముందు వారి ఉరిశిక్ష అమలు పై స్టే లభించింది.
వినయ్, అక్షయ్ క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించిన తరువాత రాష్ట్రపతి క్షమాభిక్ష కోరారు.
ఎందుకంటే నిబంధనల ప్రకారం క్యూరేటివ్ పిటీషన్ ల తరువాతే క్షమాభిక్ష కోరడానికి అవకాశం ఉంటుంది.అందుకే ఈ సమయంలో ఆలస్యం కావడం,ఇంకా పిటీషన్ లు పెండింగ్ లో ఉండడం తో కోర్టు స్టే విధిస్తూ జనవరి 31 న ఆదేశాలు జారీ చేసింది.
అయితే ప్రస్తుతం వారం రోజులు గడువు ఇచ్చిన కోర్టు గడువు కాలం ముగిసిన తరువాత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించింది.దోషుల్లో ఒకడైన పవన్ ఇంకా క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేయలేదు.