కరోనా వైరస్ పరీక్షలు, సమాచారం వెల్లడి తీరుపై తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.తెలంగాణ కరోనా పరిస్థితులపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.
హెల్త్ బులిటెన్లలో వెల్లడిస్తున్న కరోనా టెస్టులు, కరోనా పాజిటివ్ లెక్కల్లో తేడా ఉందని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.ఇదే విషయంపై గతంలో కూడా ఆదేశాలు ఇచ్చామంది.
రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవద్దని చెప్పాలని.
సదరు అధికారులను సస్పెండ్ చేయాలని ఎందుకు ఆదేశించకూడదో చెప్పాలని ప్రశ్నించింది.ఈ విషయంలో పదే పదే ఆదేశిస్తున్నప్పటికీ ఒక్కటి కూడా అమలు కావడం లేదని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఢిల్లీ, ఏపీ రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పరీక్షల్లో తెలంగాణ వెనకబడి ఉందని హైకోర్టు పేర్కొంది.టెస్టుల విషయంలో ఏపీతో పోలిస్తే.రాష్ట్రం వెనుకంజలో ఉందని స్పష్టం చేసింది.ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం నిద్రపోతోందని హైకోర్టు మండిపడింది.బులెటిన్లలో సమగ్ర వివరాలు ఇవ్వడం లేదని .ఆస్పత్రుల వారిగా బెడ్లు, వెంటిలేటర్ల వివరాలను అధికారులు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను దాచిపెట్టి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరోవైపు కరోనా విషయంలో హైకోర్టు అభినందించిందని బులిటెన్ లో పేర్కొనడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.ఓ వైపు న్యాయస్థానం మొట్టికాయలు వేస్తుంటే అభినందించినట్లు ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తారని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.