ఢిల్లీ లో హై అలర్ట్ ప్రకటించారు.ఉగ్రదాడి ఎప్పుడైనా జరగొచ్చు అన్న ఇంటలిజెన్స్ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ లో హై అలర్ట్ ప్రకటించారు.
జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల ఆర్టికల్ 370 ని రద్దు చేసిన సంగతి తెలిసిందే.ఈ నెల 31వ తేదిన జమ్మూకశ్మీర్తో పాటు ఢిల్లీలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు తెగబడవచ్చని కేంద్ర నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేయడం తో ఈ మేరకు కేంద్ర సర్కార్ హై అలర్ట్ ప్రకటించింది.
నవంబర్ 1వ తేదిన కేంద్రం.జమ్మూకశ్మీర్ పునర్విభజన చట్టాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 48గంటల పాటు హైఅలర్ట్ ప్రకటించింది.
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఢిల్లీని తమ హిట్ లిస్ట్లో పెట్టారని అందిన సమాచారంతో కేంద్ర పారామిలిటరీ బలగాలతో పాటు ఢిల్లీ పోలీసులు కూడా ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.ఎలాంటి ఉగ్ర దాడులు జరగకుండా నివారించేందుకు వీలుగా ఢిల్లీలోని ముఖ్యమైన ప్రాంతాలు, భవనాల వద్ద సాయుధ పోలీసులను మోహరించారు.మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా భారత క్రికెటర్లకు ఉగ్రముప్పు పొంచి ఉందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి లేఖ అందడం తో పోలీసులు అప్రమత్తమయ్యారు.ముందు జాగ్రత్తగా ఆటగాళ్లకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
అయితే త్వరలో బంగ్లాదేశ్ తో టీమిండియా జరగనున్న మ్యాచ్ కు భారీ భద్రత అందించాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించారు.
అలానే ఈ ఉగ్రవాదుల హిట్ లిస్ట్లో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఎల్కే అద్వానీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, గోవా గవర్నర్ సత్య పాల్ మాలిక్ తదితరుల పేర్లు కూడా ఉన్నట్లు కూడా ఇంటలిజెన్స్ తెలిపింది.