ఒకరి జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చారు అంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయ్యి ఉండాలి కదా.జీవితంలో కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి.
కానీ కాస్త కాలంలో వాటిని ఎలా ఎదుర్కోవాలి అనేదే ముఖ్యం.ఆ సారాన్ని తెలిపే ఒక వ్యక్తి జీవిత విశేషాలను పాఠ్యాంశంగా చేర్చారు.
ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనుకున్నారు.ఆమే సుధా చంద్రన్.
మయూరి చిత్ర కథానాయిక.ఆమె జీవితాన్ని ఆధారంగా తీసుకొనే ఆ సినిమాను చిత్రీకరించారు.
ఇక ఆమె గురించి అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే.ఆమె ఒక యాక్సిడెంట్ లో కుడి కాలును కోల్పోయింది.అప్పుడు జైపూర్ పాదం పెట్టారు.దాంతోనే తాను డాన్స్ చేసి విజయవంతం అయింది అని.కానీ అవే కాకుండా సుధా చంద్రన్ జీవితంలో మరెన్నో సమస్యలు ఉన్నాయి.అవేంటో చూద్దాం.
సుధా చంద్రన్ సెప్టెంబర్ 21.1964 న కేరళలోని కన్నూర్ లో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.ఆమె ముంబైలో గల మిథీబాయి కళాశాల నుండి బి.ఎ డిగ్రీని ఆ తర్వాత ఎం.ఎ డిగ్రీని పొందారు.జూన్ 5 1981 న ఆమె ముంబై నుండి తమిళనాడుకు విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ఘోర ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.
వైద్యులు ఆమె కాలికి తగిలిన గాయానికి కట్టుకట్టారు.రెండు వారాల తర్వాత ఆమె మద్రాసు వచ్చి వైద్యులను సంప్రదించగా వారు ఆ గాయం కారణంగా ఆమె కాలు తొలగించాలని, లేదంటే ఆమె ప్రాణానికే ప్రమాదం అని చెప్పారు.
దీంతో మరో దారి లేక ఆమె తల్లిదండ్రులు కూడా ఆ కాలును తీసేందుకు ఓకే చెప్పారు.దీంతో ఆమె ఒక కాలిని తొలగించారు.ఈ సంఘటనతో ఆమె చాలా కుంగిపోయి, తాను ఇక డాన్స్ చేయలేనేమో అని తీవ్ర నిరాశ పడింది.అప్పుడే పేపర్ లో వచ్చిన ఒక ప్రకటన ఆమె జీవితాన్నే మార్చేసింది.
జైపూర్ లో వైద్యులు ‘జైపూర్ కాలు’ ను కృత్రిమంగా అమరుస్తారు అనే వార్త చూడడంతో.ఆ తర్వాత వెంటనే ఆ జైపూర్ కాలును తెప్పించి ఆమెకు అమర్చారు.
అప్పట్నుంచి తిరుగి తన డాన్స్ ప్రాక్టీస్ ని మళ్ళీ మొదలు పెట్టారు సుధా చంద్రన్.అలా ఆమె ఆత్మ సడలని విశ్వాసంతో కృషిచేసి ఆ కృత్రిమ కాలితోనే నాట్య ప్రదర్శనలిచ్చి అందరినీ అబ్బురపరిచారు.
దీంతో ఆమె ప్రతిభ నలుమూలలా వ్యాపించి ఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి.
ఇదిలా ఉండగా.ఆమె జీవితం గురించి విన్న నిర్మాత రామోజీ రావు .సుధా చంద్రన్ జీవితంలో జరిగిన ముఖ్య విషయాలను ఆధారంగా తీసుకొని సినిమా చేయాలని అనుకున్నారట.వెంటనే సింగీతం గారిని పిలిపించి ఆమెకు సంబంధించిన వివరాలన్నీ సేకరించి, ఒక హీరోయిన్ ను అనుకున్నారట.ఆ తర్వాత ఆమె ముఖంలో ఉన్న హావ భావాలు చూసి ఆమెనే ఆ చిత్రంలో నటించమని అడిగారట.
దీంతో ఆమె కూడా ఓకే అనడంతో అలా మయూరి సినిమా వచ్చిందట.అలా అప్పటి వరకు ఆమెకు ఉన్న టాలెంట్ ఆ సినిమాతో పలు దేశాలకు కూడా విస్తరించింది.
అలా చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు కూడా చేసి ప్రేక్షకుల్ని అలరించారు సుధా చంద్రన్.టీవీ సీరియల్స్ లోనూ నటించి బుల్లితెర అభిమానులకు కూడా ఆమె దగ్గరయ్యారు.
“వైకల్యాన్ని లోటుగా భావించకండి.వైఫల్యాలను ఎదుర్కొండి.
సమస్య వచ్చినపుడు మనం భయపడి పారిపోకూడదు.ధీటుగా ఎదురించాలి.
విజయం సాధించాలి”.ఇది ఆమె అందరికీ ఇచ్చే సందేశం.
ఆమె జీవితం ఎంతో మందికి స్ఫూర్తి దాయకం.ముఖ్యంగా వైఫల్యాలకు లోనైన వారందరికీ కూడా ఆమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయలనేదే ఆమె కోరిక.