కరోనా, లాక్ డౌన్ వల్ల గతేడాది నుంచి సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే.ఆదాయం తగ్గడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన చాలామంది చదువుకు దూరమవుతున్నారు.
అలా ఒక యువతి కూడా కాలేజీ ఫీజు కట్టడానికి ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసి హీరోయిన్ కాజల్ అగర్వాల్ లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారని సమాచారం.
పూర్తి వివరాల్లోకి వెళితే హైదరాబాద్ కు చెందిన సుమ అనే విద్యార్థిని ప్రస్తుతం ఎంఫార్మసీ చదువుతున్నారు.
ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ సుమ కాలేజ్ ఫీజు చెల్లించేవారు.అయితే లాక్ డౌన్ నిబంధనలు, ఇతర కారణాల వల్ల సుమ ఉద్యోగం కోల్పోయారు.
సుమ కాలేజ్ ఫీజు 82 వేల రూపాయలు చెల్లిస్తే మాత్రమే ఆమెను పరీక్షకు అనుమతిస్తామని కాలేజీ యాజమాన్యం తెలిపింది.
ఆర్థిక సమస్యల వల్ల చదువు మధ్యలో ఆగిపోకూడదని భావించిన సుమ సోషల్ మీడియా ద్వారా ఆర్థిక సహాయం చేయాలని కాజల్ అగర్వాల్ ను కోరింది.
విషయం తెలిసిన కాజల్ అభిమానికి లక్ష రూపాయలు సాయం చేసినట్టు నెట్టింట వైరల్ అవుతోంది.అయితే అభిమానికి సాయం చేసినట్టు కాజల్ వైపు నుంచి ఎలాంటి ప్రకటన లేదు.
కాజల్ ఫ్యాన్స్ మాత్రం ఆమె గూగుల్ పే ద్వారా లక్ష రూపాయలు పంపించినట్టు ఉన్న స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
కొందరు నెటిజన్లు కాజల్ చేసిన మంచి పనిని ప్రశంసిస్తున్నారు.అయితే కాజల్ వైపు నుంచి ప్రకటన వస్తే మాత్రమే ఈ వార్త నిజమో కాదో తెలిసే అవకాశం ఉంది.కాజల్ ఫ్యాన్స్ మాత్రం ఆమెది గొప్ప మనస్సు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు.
ప్రస్తుతం కాజల్ ఆచార్య మూవీలో నటిస్తున్నారు.