గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న సంగతి తెలిసిందే.వర్షాల ధాటికి పలు ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోగా మరికొన్ని ప్రాంతాల్లో వరద నీటిలో పంట పొలాలు మునిగిపోయాయి.
ఈ వర్షాల వల్ల కృష్ణా జిల్లా అవనిగడ్డ సమీపంలో శర్వానంద్ తాతగారైన డాక్టర్ మైనేని హరిప్రసాద్ ఇల్లు వరద నీటిలో కొట్టుకుపోవడం గమనార్హం.భారత మాజీ అణు శాస్త్రవేత్త అయిన హరిప్రసాద్ గారికి తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది.
శర్వానంద్ ఎప్పుడైనా తాతయ్య ఇంటికి వెళితే ఈ ఇంట్లోనే గడిపేవారు.కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో తీరప్రాంతాలు కోతకు గురవుతున్నాయి.భారీగా వరద నీరు చేరడంతో నీటి ఉధృతికి హరిప్రసాద్ ఇల్లు కొట్టుకుపోయింది.అయితే గత కొన్ని నెలలుగా ఈ ఇంట్లో ఎవరూ నివశించడం లేదని తెలుస్తోంది.
హరిప్రసాద్ గారు అణు శాస్త్రవేత్తగానే కాక సంఘసేవకుడిగా కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.
శర్వానంద్ తాతగారి ఇల్లు కొట్టుకుపోయిందనే వార్త తెలియడంతో స్థానికులు పెద్దసంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
స్థానికంగా హరిప్రసాద్ కు మంచిపేరు, గుర్తింపు ఉండటంతో స్థానికులు ఇల్లు కొట్టుకుపోయిన విషయం తెలిసి ఆవేదన చెందారు.గతేడాది వరదల్లో శర్వానంద్ ముత్తాత గారి ఇల్లు సైతం కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.
హరిప్రసాద్ గారు నది ఒడ్డున కొన్నేళ్ల క్రితం పెంకుటిల్లును నిర్మించుకున్నారు.వరద నీటి వల్ల పునాది కదలడంతో వరద ఉధృతికి ఇల్లు కొట్టుకుపోయింది.
మరోవైపు హీరో శర్వానంద్ ఈ సంవత్సరం జాను సినిమాతో చేదు అనుభవం ఎదురు కావడంతో నవ్యత ఉన్న కథలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. శర్వానంద్ నటించిన శ్రీకారం సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకోగా ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.