టాలీవుడ్ నటుడు సచిన్ జోషీ మనందరికీ సుపరిచితమే.మల్టీ బిలియనీర్ అయిన సచిన్ జోషీ తెలుగులో చాలా సినిమాల్లో హీరోగా నటించినా సక్సెస్ మాత్రం దక్కలేదు.
హీరో అనిపించుకోవడానికి తెగ ఉబలాటపడిపోయినా నటించిన ఏ సినిమా హిట్ కాకపోవడంతో చివరకు వ్యాపారాలు చేసుకుంటూ సినిమాలకు దూరమయ్యాడు.గతంలో బండ్ల గణేష్ తో ఒక వివాదం ద్వారా పాపులర్ అయిన సచిన్ జోషీ తాజాగా హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడంతో వార్తల్లో నిలిచాడు. పూర్తి వివరాల్లోకి వెళితే ఈ సంవత్సరం మార్చి నెలలో హైదరాబాద్ పోలీసులు భారీ మొత్తంలో గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.గుట్కాను తరలిస్తూ పట్టుబడిన నిందితులను విచారించగా వాళ్లు సచిన్ జోషీ పేరు చెప్పారు.
లక్షల రూపాయల విలువ చేసే గుట్కా సంబంధించి బహదూర్ పురా పోలీస్ స్టేషన్ లో 273, 336 సెక్షన్ల కింద కేసు నమోదైంది.ఈ కేసులో సచిన జోషీ పేరు వెలుగులోకి రావడంతో క్రిమినల్ పీనల్ కోడ్ 41 సెక్షన్ కింద సచిన్ జోష్ పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.
దుబాయ్ నుంచి ముంబై కు సచిన్ జోషీ చేరుకోగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.అనంతరం పోలీసులు విచారణ నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు.
పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.హీరో సచిన్ జోషీని అరెస్ట్ చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు వెలుగులోకి రాగా ఈ గుట్కా కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. మౌనమేలనోయి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన సచిన్ జోషీ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నటించాడు.
పలు సినిమాలకు సచిన్ జోషీ నిర్మాతగా వ్యవహరించాడు.