పరమేశ్వరుడికి ఎంతో పుణ్య స్థలమైన కాశీ మహా పుణ్యక్షేత్రం అంటే ఎంతో ఇష్టమని ఆధ్యాత్మిక పండితులు చెబుతుంటారు.కానీ ఆ పరమశివుడికి కాశీ కన్నా ఎంతో ఇష్టమైన ప్రదేశం మరొకటి ఉందని పురాణాలు చెబుతున్నాయి.
శివుడు ఎంతగానో ఇష్టపడిన ఆ ప్రాంతంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి.కాశీ కన్నా పరమేశ్వరుడు ఎక్కువగా ఇష్టపడిన ప్రాంతం ఏది? ఆ ప్రాంత విశిష్టత ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఒడిస్సా రాష్ట్రంలో బిందుసాగరం అని ఒక కొలను ఉంది.ఈ ప్రదేశం అంటే పరమశివుడికి ఎంతో ఇష్టం.ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలోని కోనేటిలో ప్రతి సంవత్సరం పూరీ జగన్నాథుని విగ్రహాన్ని తీసుకువచ్చి బిందుసాగరం అనే కొలనులో స్నానం చేయిస్తారు.పురాణాల ప్రకారం ఈ ప్రదేశం అంటే పరమశివుడికి ఎంతో ఇష్టం అని తెలుసుకున్న పార్వతీ దేవి ఆ ప్రాంతాన్ని చూడాలని ఎంతో ఇష్టపడి ఒక గోపిక రూపంలో ఆ ప్రాంతానికి చేరుకుంటుంది.
గోపిక రూపంలో ఉన్న పార్వతీ దేవిని చూడగానే కృత్తి, వాస అనే ఇద్దరు రాక్షసులు ఆమెను చూసి మోహించారట.అప్పుడు ఆ రాక్షసులను చూసిన పార్వతీదేవి తనను వారి భుజాల మీద మోసుకెళ్ళమని వారితో చెబుతుంది.ఈ సమయంలోనే వారు పార్వతీదేవిని భుజాల పై తీసుకు వెళ్తున్న సమయంలో వారిని అణచి వేస్తుంది.ఈ విధంగా రాక్షసులతో పార్వతీదేవి పోరాటం వల్ల ఆమెకు ఎంతో దాహం వేస్తుంది.
ఈ క్రమంలోనే పార్వతి దేవి దాహాన్ని తీర్చాలని పరమశివుడు ప్రతీ నదులు, సరస్సులు ఒక్కొక్క బిందువు రాల్చమని ఆజ్ఞాపించాడు.ఆ సమయంలో అన్ని సరస్సులు, నదులు నీటి బిందువులను రాల్చగా కేవలం గోదావరి నది మాత్రం నీటి బిందువులను ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన పరమశివుడు గోదావరి నదిను శపించాడు.
ఈ విధంగా పరమేశ్వరుని శాపం వల్ల గోదావరి నది నీళ్లన్నీ ఎంతో అపవిత్రంగా మారుతాయి.ఆ తర్వాత తన తప్పును తెలుసుకున్న గోదావరి నది శివుడిని పశ్చాత్తాపంతో పూజించి శాపం నుంచి విముక్తి చేయాలని కోరగా పరమేశ్వరుడు గోదావరి నదికి శాప విముక్తి కలిగించాడని స్థల పురాణాలు చెబుతున్నాయి.