తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ను ఏదో రకంగా ఇరుకునబెట్టి, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ గెలుపు ఎటువంటి డోకా లేకుండా చూసుకునేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది.కేంద్రం బీజేపీ పెద్దల నుంచి అన్ని రకాలుగా మద్దతు లభిస్తుండడం, ఆ పార్టీ పెద్దలు సైతం టిఆర్ఎస్ పై విమర్శలు మరింత తీవ్రం చేయడం వంటి వ్యవహారాలు చోటుచేసుకుంటున్నాయి.
హుజురాబాద్ , దుబ్బాక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలవడం మరింత ఉత్సాహం కలిగిస్తోంది.ఇదే తరహాలో తెలంగాణ అంతటా అన్ని నియోజకవర్గాల్లోనూ బలం పెంచుకోవాలని బిజెపి భావిస్తోంది.
ఇదే అంశాలపై చర్చించేందుకు నేడు, రేపు హైదరాబాదులోని పాతబస్తీ కాటేదాన్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీ లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.ముందుగా ఆదిలాబాద్ జిల్లాలో ఈ సమావేశాలను నిర్వహించాలని చూసినా, ఎమ్మెల్సీ కోడ్ కారణంగా పాతబస్తీకి ఈ సమావేశాలు మార్చారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈ సమావేశంలో ప్రస్తుతం తెలంగాణ లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు , టిఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల విస్మరించడం, బీజేపీ కార్యకర్తల పై టిఆర్ఎస్ వేధింపులు , నిరుద్యోగం, రైతు సమస్యలు, దళిత ,గిరిజనులు ,కార్మికుల సమస్యలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే విషయంతో పాటు, పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యలను చర్చించాలని నిర్ణయించారు.
అలాగే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని రాష్ట్రమంతా వర్తింప చేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలని తెలంగాణ బిజెపి నేతలు నిర్ణయించారు.
నిరుద్యోగ భృతి అందిస్తామంటూ గతంలో ఇచ్చిన హామీ పై బిజెపి న్యాయ పోరాటం చేసేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతోందని , అలాగే బీసీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించే విధంగా ఒత్తిడి తీసుకురావాలని , అలాగే వరి ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని, ఇలా ఎన్నో అంశాలపై నేడు రేపు జరగబోయే సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.