కరోనా విలయతాండవానికి భారతావని అల్లాడిపోతోంది.ఇప్పటికే చాప కింద నీరులా దేశం మొత్తం విస్తరించిన ఈ మహమ్మారి కోరల్లో చిక్కి లక్షలాది మంది విలవిలలాడిపోతున్నారు.
ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేలాది మరణాలతో దేశంలో హృదయ విదారకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3.86 లక్షల మందికి పాజిటివ్గా తేలగా, మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు.దీంతో భారత్ను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొస్తోంది.
ఇప్పటికే వివిధ దేశాల నుంచి ఆక్సిజన్, వైద్య సామాగ్రి, మందులు భారత్కు చేరుకున్నాయి.రానున్న రోజుల్లో ఈ సాయం మరింత పెరిగే అవకాశం వుంది.
అటు పుట్టెడు కష్టంలో వున్న జన్మభూమిని ఆదుకునేందుకు ఎన్ఆర్ఐలు సైతం బాసటగా నిలుస్తున్నారు.ఇప్పటికే ఆక్సిజన్ కొరతతో ఇబ్బందులు పడుతున్న మనదేశంలోని ఆసుపత్రులకు మద్ధతుగా నిలిచారు భారత సంతతికి చెందిన అమెరికన్ బిలియనీర్ వినోద్ ఖోస్లా.
ఆక్సిజన్ను దిగుమతి చేసుకోవడానికి వనరులు అసవరమయ్యే భారతీయ ఆసుపత్రులకు తాను నిధులు సమకూరుస్తానని వినోద్ ఖోస్లా ప్రకటించారు.ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు.
సాయం కావాల్సిన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా సంప్రదించాలని ఆయన సూచించారు.
మరోవైపు భారతీయ అమెరికన్ సంఘాలు కూడా భారత్కు సాయం చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి.దీనిలో భాగంగా ప్రముఖ ఎన్జీవో సంస్థ SEWA ఇంటర్నేషనల్.5 మిలియన్ డాలర్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది.అలాగే 400 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు సహా అత్యవసర వైద్య సామాగ్రిని భారత్కు పంపుతున్నట్లు సేవా సంస్థ తెలిపింది.భారతీయ ఆసుపత్రులకు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందించేందుకు గాను “Help India Defeat COVID-19’’ ప్రచారాన్ని కూడా ప్రారంభించింది.
వీటితో పాటు సేవా సంస్థ దేశంలోని 10000 కుటుంబాలకు, 1,000కి పైగా అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు ఆహారం, మందులను అందిస్తామని తెలిపింది.
తాజాగా బ్రిటన్లోని ప్రవాస భారతీయులు కూడా మాతృదేశాన్ని ఆదుకునేందుకు సిద్ధమయ్యారు.ఈ సంక్షోభ సమయంలో యూకేలోని కొన్ని భారతీయ సమాజాలు పలు విధాలుగా స్పందిస్తున్నాయి.వాయువ్య లండన్లోని వెంబ్లీలో ఉన్న ఒక హిందూ దేవాలయంలో బ్రిటిష్ ఇండియన్లు తమ సహచరుల కోసం సామూహిక ప్రార్థనలు జరుపుతున్నారు.
బ్రిటిష్ ఆసియన్ ట్రస్ట్ అనే ప్రవాస సంస్థ … ‘‘ఆక్సిజన్ ఫర్ ఇండియా’’ ప్రచారం నిర్వహిస్తోంది.తద్వారా ఇప్పటికే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కొనేందుకు కొన్ని వేల పౌండ్లను సేకరించారు.
ఇక బ్రిటిష్ ఇండియన్స్ నిర్వహించిన మరో క్యాంపెయిన్ ‘గో ఫండ్ మి’కి కూడా భారీ స్థాయిలో స్పందన లభించింది.ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని దాటి ఒక్క రోజులోనే 16,00,000 పౌండ్లను (భారత కరెన్సీలో రూ.16.5 కోట్లు) సేకరించింది.ఈ నిధుల ద్వారా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కొనుగోలు చేసి వీలైనంత త్వరగా భారత్కు పంపాలనే ఆలోచనలో ఉన్నారు.