తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కు దక్కబోతున్న రెండు రాజ్యసభ స్థానాలపై ఆశావాహులు భారీగా ఆశలు పెట్టుకున్నారు.కేసీఆర్ దయ తమ మీద ఉండేలా ఎవరికి వారు తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
దీంతో రెండు రాజ్యసభ స్థానాలు భర్తీ చేయించడం కెసిఆర్ కు కత్తి కత్తి మీద సాములా మారింది.ఏ ఇద్దరికి రాజ్యసభ స్థానాలు కట్టబెట్టినా, మిగతా వారంతా తీవ్ర అసంతృప్తికి గురి అవుతారు.
అంతేకాకుండా ఇప్పుడు రాజ్యసభకు పోటీ పడే దాదాపు పది మంది అభ్యర్థులు కూడా కేసీఆర్ కు అత్యంత సన్నిహితులు.అంతేకాకుండా వీరందరికీ రాజ్యసభ స్థానం ఇస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో, వీరంతా ఇప్పుడు తమకు అవకాశం దొరుకుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇక సార్వత్రిక ఎన్నికలకు ముందు రెబెల్స్ ను పోటీ నుంచి తప్పించేందుకు కెసిఆర్, హరీష్ రావు హామీలు ఇచ్చారు.దీంతో ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవాలని మరికొంతమంది కేసీఆర్ పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సంగతి ఇలా ఉంటే, రెండు స్థానాల్లో ఒక స్థానాన్ని తనకు కేటాయించాలంటూ కెసిఆర్ కుమార్తె మాజీ ఎంపీ కవిత గట్టిగా పడుతున్నట్లు తెలుస్తోంది.దీనికి కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర ఒత్తిడి కేసీఆర్ ఎదుర్కొంటున్నట్టు సమాచారం.
కవితతో పాటు సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కూడా తనకు మరోసారి అవకాశమివ్వాలని కోరుతున్నారు.ఆయనతో పాటు హోం శాఖ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి సామాజిక వర్గం నుంచి ఈ ఇద్దరూ గట్టిగా పోటీ పడుతున్నారు.
ఇందులో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి జగన్ సిఫార్స్ కూడా ఉండడంతో, తప్పనిసరిగా తనకు అవకాశం దక్కుతుందనే ధీమాతో ఉన్నారు.ఇక దళిత వర్గాల నుంచి చెప్పుకుంటే, మాజీ మంత్రి కడియం శ్రీహరి తనకు అవకాశం కల్పించాలంటూ కెసిఆర్ వద్దకు రాయబారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది.వీరే కాకుండా పారిశ్రామిక వర్గాల నుంచి కూడా అనేక విజ్ఞప్తులు కెసిఆర్ కు వస్తున్నాయట.దీంతో అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నారట.ఎంత మంది పోటీ పడినా ఇద్దరికే అవకాశం ఉంటుంది కాబట్టి మిగతా వారిని ఏ విధంగా బుజ్జగించాలా అనేదానిపై కెసిఆర్ దృష్టి పెట్టినట్లు సమాచారం.