మామూలుగానే రాయలసీమ అంటే ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు.అలాంటిది ఇప్పుడు కర్నూలులోని పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల జంట హత్యల కేసు పెద్ద దుమారమే రేపుతోంది.
ఇది వైసీపీ చేయించిందని ఇప్పటికే ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.కాగా ఈ ఆరోపణలతో ఇప్పుడు కర్నూలు లోని వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య అగ్గి రాజుకుంటోంది.
పరస్పర ఆరోపణలతో రాజకీయాలను హీటెక్కిస్తున్నారు.
ఇక ఈరోజు నారా లోకేష్ హత్యలకు గురైన ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డికి నివాళి అర్పించి, వారి కుటుంబాలను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికే స్థానిక పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై ఈ హత్యల ఆరోపణలు వస్తున్నాయి.దీంతో లోకేష్ చేసిన కామెంట్లు వీటికి ఆజ్యం పోసేలా ఉన్నాయి.సీఎం జగన్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే ఈ జంట హత్యల కేసుపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
స్థానికంగా ఉన్న కుక్క మొరుగుతోందని, సీబీఐతో విచారణ చేస్తే దాని సంగతి బయటపడుతుందని దుమారం రేపే కామెంట్లు చేశారు.ఇప్పటికే తమ కార్యకర్తలను 17మందిని హత్య చేయించారని సంచలన ఆరోపణలు చేశారు లోకేష్.
అయితే లోకేష్ చేసిన ఆరోపణలతో కర్నూలు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.అసలే అవకాశం కోసం చూస్తున్న కార్యకర్తలు లోకేష్ మాటలతో రెచ్చిపోయారు.దీంతో అటు వైసీపీ కూడా అదే స్థాయిలో ఆరోపణలు చేస్తోంది.వాస్తవాలు తెలియకుండా మాట్లాడటం లోకేష్కు అలవాటే అంటూ మండిపడుతున్నారు జగన్ సేనలు.ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న కాటసాని రాంభూపాల్ రెడ్డి మాత్రం ఈ వ్యాఖ్యలపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం.ఆయన మౌనంగా ఉండటమే పెద్ద ఎత్తున అనుమానాలకు తావిస్తోంది.
కేవలం కింది స్థాయి కార్యకర్తలు మాత్రమే మాట్లాడుతున్నారు.కానీ ఎమ్మెల్యే మాత్రం నోరు విప్పకపోవడం ఇక్కడ పెద్ద ట్విస్టుగా మారింది.