కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,మాజీ ప్రధాని దేవ గౌడ కుమారుడు హెచ్ డీ కుమార స్వామి తీహార్ జైలుకు వెళ్లారు.ఈ రోజు ఉదయం ఆయన తీహార్ జైలుకు వెళ్లి అక్కడ ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ ను కలిసినట్లు తెలుస్తుంది.
గత ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ,కాంగ్రెస్ పార్టీ లు కలిసి కర్ణాటక లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.అయితే ఆ తరువాత వచ్చిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వాన్ని దించి బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచింది.
అయితే ఇటీవల మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన శివకుమార్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న విషయం విదితమే.ఈ క్రమంలో ఆయనను ప్రస్తుతం తీహార్ జైలుకు తరలించగా, కుమారస్వామి శివకుమార్ ని కలవడానికి సోమవారం తీహార్ జైలుకు వచ్చారు.
కాంగ్రెస్, జేడీఎస్ల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో శివకుమార్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ ట్రబుల్ షూటర్గా పేరుగాంచిన శివకుమార్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడేందకు చివరివరకు ప్రయత్నించాడు.కానీ, రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.దీనితో అక్కడ బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచి గట్టిగానే పాగా వేసింది.